న్యూఢిల్లీ: వారం రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను డిసెంబర్ 3న ప్రారంభంకానున్న భారత్-దక్షిణాఫ్రికా నాల్గవ టెస్ట్ సందర్భంగా ఢిల్లీలో సన్మానించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) ఏర్పాట్లు చేస్తోంది.
కాగా, వాంఖడే స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో వన్డే సందర్భంగా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన పేస్ బౌలర్ జహీర్ ఖాన్ను బిసిసిఐ సన్మానించిన విషయం తెలిసిందే.అక్టోబర్ 20న సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.

ఢిల్లీ జట్టుకు సుదీర్ఘ కాలం ప్రాతినిథ్యం వహించిన ఈ 37ఏళ్ల విధ్వంసక బ్యాట్స్మన్.. ప్రస్తుతం హర్యానా జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. కాగా, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్లు ప్రారంభించిన క్రికెట్ ఆల్ స్టార్స్ సిరీస్లో సచిన్ జట్టు తరపు ఆడనున్నాడు. వచ్చే నెలలో అమెరికాలో ప్రారంభం కానున్న ఈ సిరీస్లో ప్రపంచ క్రికెట్ మాజీ దిగ్గజాలు ఆడుతున్నారు.
కాగా, భారత ఓపెనర్గా సేవలందించిన సెహ్వాగ్ను ఘనంగా సన్మానించాలని బిసిసిఐ భావిస్తోంది. అయితే ఈ విషయంపై డిడిసిఏకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు.
'బిసిసిఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. ఒక వేళ బిసిసిఐ చెప్పివుంటే అది జరుగుతుంది. మా తరపున ఏం చేయాలో మేం కూడా చర్చించుకుంటున్నాం' అని డిడిసిఏ అధ్యక్షుడు స్నేహ్ ప్రకాశ్ బన్సల్ తెలిపారు. అయితే సెహ్వాగ్ను సన్మానించే విషయంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.