హైదరాబాద్: టీమిండియాకు కొత్త ప్రొపెషనల్ మేనేజర్ను ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. ఇందుకోసం ఓ ప్రణాళిక కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బీసీసీఐ తాజా నిర్ణయంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మేనేజర్ను మార్చాల్సిన అవసరం ఏంటీ? ఉన్నట్టుండి ఈ అంశం తెరపైకి ఎందుకు వచ్చిందని సగటు క్రికెట్ అభిమాని మదిలో తొలుస్తున్న ప్రశ్న.
ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ప్రస్తుతం జట్టు మేనేజర్గా ఉన్న కపిల్ మల్హోత్రా సమర్పించిన నివేదికే ఇందుకు కారణమని తెలుస్తోంది. అతను సమర్పించిన నివేదికే అతడి ఉద్యోగం ఊడేందుకు కారణమైందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా స్వదేశంలో లేదా విదేశాల్లో టీమిండియా ఏ సిరిస్ ఆడినా సిరిస్ ముగిసిన తర్వాత జట్టు మేనేజర్ బోర్డుకి నివేదిక సమర్పిస్తుండటం ఆనవాయితీ.

అయితే తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత కపిల్ మల్హోత్రా అందించిన నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో భారత్ పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలవడం, ఆ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కపిల్ మల్హోత్రా ఈ రెండు విషయాలపై తన నివేదికలో ఏం పేర్కొంటాడో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోహ్లీతో పొసగకపోవడం వల్లే కోచ్ పదవికి రాజీనామా చేశానని అనిల్ కుంబ్లే ట్విట్టర్ వేదికగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కపిల్ మల్హోత్రా తన నివేదికలో ఏమీ పొందు పరచలేదని బీసీసీఐ పేర్కొంది.
అంతేకాదు కోహ్లీ-కుంబ్లే గొడవని కూడా పెద్దగా ప్రస్తావించలేదంట. కుంబ్లే, కోహ్లీ కనీసం సరిగా మాట్లాడుకోని మాట నిజమేననీ... ఐసీసీ టోర్నమెంట్ జరిగినన్ని రోజులూ ఎడమొహం పెడమొహంగా ఉన్నారని మల్హోత్రా పేర్కొన్నాడు. అయితే వారు దేనిపై గొడవపడ్డారో వ్యక్తిగతంగా తాను చెప్పలేనని వెల్లడించారు.
ఈ ప్రభావం డ్రెస్సింగ్ రూమ్పై పడలేదనీ... కుంబ్లే, బంగర్, శ్రీధర్లతో పాటు సీనియర్ ఆటగాళ్లు ధోనీ, యువరాజ్లు టీమ్లోని యువ ప్లేయర్లతో తమ అనుభవాలు పంచుకున్నారని మల్హోత్రా వెల్లడించారు. కాగా ఏదైనా పెద్ద గొడవ జరిగిందా అన్న దానిపై మల్హోత్రా తన నివేదికలో ప్రస్తావించలేదని బీసీసీఐ పేర్కొంది.
ఈ నేపథ్యంలో కపిల్ మల్హోత్రా నివేదికను చూసి ఆశ్చర్యపోయిన బీసీసీఐ భారత జట్టుకి ప్రొఫెషనల్ మేనేజర్ను ఎంపిక చేయలన్న ఆలోచనలో పడింది. దీనిపై వారం లేదా రెండు వారాల్లో బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది.