
టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయంపై బీసీసీఐ రివ్యూ మీటింగ్ పెట్టింది. దీనికి బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, ఎన్సీయే చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ తదితరులంతా హాజరయ్యారు. ఈ సమావేశంలో టీ20 వరల్డ్ కప్ ఓటమితోపాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇకపై ఆటగాళ్ల ఫిట్నెస్, వర్క్ లోడ్ మేనేజ్మెంట్పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఇకపై ఎవరైనా యువ ఆటగాళ్లను భారత్కు ఎంపిక చేయాలంటే.. వాళ్లు దేశవాళీల్లో కూడా రాణించి ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది. గతంలో ఐపీఎల్ ప్రదర్శనలను కూడా పరిగణనలోకి తీసుకొని, కొందరు ఆటగాళ్లను టీమిండియాకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇకపై అలా కుదరదని రోజర్ బిన్నీ టీం స్పష్టం చేసిందట. అలాగే టీమిండియా సెలెక్షన్లో యోయో టెస్టు, డెక్సా టెస్టులను కూడా కలుపుతున్నట్లు ప్రకటించారు. ఇకపై ఏ ఆటగాడు జట్టుకు ఎంపికైనా వాళ్లు ఈ పరీక్షలు పాసవ్వాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో పలువురు టీమిండియా ఆటగాళ్లు గాయాలపాలై జట్టుకు దూరమైన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఎన్సీయే బృందం ఐపీఎల్పై కూడా ఫోకస్ పెట్టనుంది. భారత జట్టు భవిష్యత్తు పర్యటనలను దృష్టిలో ఉంచుకొని కొందరు సెలెక్ట్ ఆటగాళ్ల గురించి ఆయా ఐపీఎల్ ఫ్రాంచైజీలతో కూడా ఎన్సీయే బృందం మాట్లాడుతుందట. సదరు ఆటగాళ్ల వర్క్లోడ్ మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తుందట. ఈ సమావేశంలో వేరు వేరు ఫార్మాట్లకు వేరు వేరు కెప్టెన్ల అంశం మాత్రం చర్చకు రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే టీమిండియాకు రోహిత్ శర్మనే సారధ్యం వహిస్తాడు. కోచ్గా రాహుల్ ద్రావిడే కొనసాగుతాడని, సమావేశంలో ఈ అంశంపై అసలు చర్చ జరగలేదని సమాచారం.