BCCI: ఇటీవల కాలంలో భారత క్రికెట్ జట్టు ఒడిదుడుకులతో నిండి ఉంది. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో టీమిండియా గత సంవత్సరం ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను గెలుచుకుంది. అనంతరం గౌతమ్ గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్ న్యూజిలాండ్ తో జరిగిన స్వదేశీ సిరీస్ ను, ఆపై ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ ను కోల్పోవలసి వచ్చింది. దీని తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
టీమిండియా కోచింగ్ స్టాఫ్లో మార్పులు
గత కొన్ని నెలలుగా టీమిండియా ఒడిదుడుకుల మధ్య భారత క్రికెట్ జట్టులో మార్పుల ప్రక్రియ ప్రారంభమయ్యే సంకేతాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. టీమిండియా ఇంగ్లాండ్ పర్యటన నాటికి సహాయక స్టాఫ్ లో భారీ మార్పులు ఉండనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియాతో పాటు జంబో సపోర్టింగ్ స్టాఫ్ ను పంపేందుకు బీసీసీఐ ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో సహాయక సిబ్బందిలోని కొన్ని స్థానాలు ప్రభావితమవుతాయని.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఇష్టమైన కొంతమంది వ్యక్తులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే ఇప్పుడు ఈ సహాయక సిబ్బందిలో మార్పులు చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం మార్చి 29న గౌహతిలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది.

మార్చి 30న గౌహతిలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్కు కేవలం ఒక రోజు ముందు.. బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ల మధ్య సమావేశం జరగనుంది. ఇందులో, కోచింగ్ సిబ్బందిలో మార్పులు, తగ్గింపుకు సంబంధించిన నిర్ణయాలను చర్చించనున్నారు. దీనితో పాటు టీమిండియా ఆటగాళ్ల కొత్త కేంద్ర ఒప్పందంపై కూడా చర్చించనున్నారు. ఇప్పటివరకు దీని గురించి మరే ఇతర బీసీసీఐ అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. అంటే బీసీసీఐ కార్యదర్శి మాత్రమే ఇందులో పాల్గొననున్నారు. అయితే ఈ సమావేశం అధికారికమా లేదా అనధికారికమా అనేది రాబోయే కాలంలో తెలియనుంది.
ఆ ఇద్దరిని..
భారత జట్టు సహాయక సిబ్బందిలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్, అసిస్టెంట్ కోచ్లు ర్యాన్ టెన్ డోర్ష్ట్, అభిషేక్ నాయర్, శిక్షణ సహాయకులు రాఘవేంద్ర, దయానంద్ గరాని, ఫిజియోథెరపిస్ట్ కమలేష్ జైన్, మసాజర్ అరుణ్ కనాడే, చేతన్ కుమార్, రాజీవ్ కుమార్, జట్టు ఆపరేషన్స్ మేనేజర్ సుమిత్ మల్లాపుర్కర్, సెక్యూరిటీ మేనేజర్, అరడజను మంది ఇతరులు ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలవడంలో వీరందరూ కీలకపాత్రే పోషించారు. ఇదిలా ఉండగా.. రాబోయే ఇంగ్లాండ్ పర్యటనకు ప్రత్యేకం అసిస్టెంట్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ అవసరం లేదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అభిషేక్ నాయర్, దిలీప్ ను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.