రెడ్ బాల్ క్రికెట్ను సంరక్షించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఐపీఎల్కు వచ్చే వేతనాన్ని రంజీ ట్రోఫీలో ఆడే ఆటగాళ్లకు అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. టెస్టు ఫార్మాట్పై యువ క్రికెటర్లకు ఆసక్తి పెంచేలా, భవిష్యత్ స్టార్లను తయారీ చేసేలా బీసీసీఐ కీలక అడుగులు వేయనుంది. దీనికోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్లతో బీసీసీఐ చర్చించినట్లు సమాచారం.
ఐపీఎల్ వేలం ముగిసిన తర్వాత యువ క్రికెటర్లు రంజీట్రోఫీలో పాల్గొనడానికి ఆసక్తి చూపించకపోవడానికి గల కారణాలను బీసీసీఐ అర్థం చేసుకుంది. ప్రస్తుతం మ్యాచ్ ఫీజు ప్రకారం ఓ సీజన్లో ఒక ఆటగాడు 10 మ్యాచ్లు ఆడితే దాదాపు రూ.25 లక్షలు దక్కుతాయి. కానీ ఐపీఎల్ వేలంలో ఓ ఆటగాడి కనీస ధర రూ.20 లక్షలు. ఈ బేస్ ప్రైజ్ కోసం ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లు పనిభారాన్ని అధికంగా మోయడానికి, గాయాలకు సిద్ధంగా ఉండటానికి ఇష్టపడట్లేదని బీసీసీఐ గ్రహించింది.

ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఫీజులను రెట్టింపు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఒక ఆటగాడు రంజీ ట్రోఫీలోని మ్యాచ్లన్నీ ఆడితే సుమారు రూ.75 లక్షలు అర్జించేలా ప్రణాళికలు రచిస్తోంది. అలాగే టెస్టు మ్యాచ్ ఫీజులు పెంచేలా యోచిస్తోంది. ఏడాదిలో ఓ భారత క్రికెటర్ అన్ని టెస్టులు ఆడితే దాదాపు రూ.15 కోట్లు సంపాదించేలా చర్చలు చేపడుతుంది. అలాగే బుధవారం ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్ లిస్ట్లో ఆటగాళ్లకు రెమ్యునేషన్ను బీసీసీఐ నిర్ణయించనుంది. జాబితా ప్రకటించినప్పటికి ఆటగాళ్లకు అధికారికంగా దక్కే మొత్తాన్ని బోర్డు వెల్లడించలేదు.
''టీమిండియా మేనేజ్మెంట్ సిఫార్సులను బీసీసీఐ కోరింది. క్రికెట్ సుదీర్ఘ ఫార్మాట్ పవిత్రను కాపాడుకోవడానికి బీసీసీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే ఆటగాళ్లకు ప్రతిఫలం దక్కడం అత్యవసరమని భావించింది. ఐపీఎల్ క్రికెట్కు సమానమైన స్థాయి దక్కేలా ప్రస్తుత రెమ్యునేషన్ను రెట్టింపు చేయాలనుకుంటుంది''
''టెస్టు, ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఫీజులను మూడు రెట్లు పెంచాలని సిఫార్సులు ఉన్నాయి. ఓ ఆటగాడు రంజీ ట్రోఫీ మొత్తం ఆడితే సగటు ఐపీఎల్ కాంట్రాక్ట్కు సరిపోయేలా రూ.75 లక్షలు అందించేలా ఆలోచిస్తోంది. అలాగే ఏడాదిలో అన్ని టెస్టు మ్యాచ్లు ఆడితే ఐపీఎల్ టాప్ కాంట్రాక్ట్కు సమానంగా నిలిచేలా రూ. 15 కోట్లు ఇవ్వాలని సిఫార్సులో ఉంది'' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.