స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని టీ20 జట్టు నుంచి తప్పించే పనుల్లో బీసీసీఐ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్కు కోహ్లిని ఎంపిక చేయొద్దని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జూన్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు మినహా మిగిలిన మ్యాచ్లన్నీ వెస్టిండీస్లోనే జరగనున్నాయి.
అయితే వెస్టిండీస్ పిచ్లు చాలా స్లోగా ఉంటాయి. అక్కడి పరిస్థితుల్లో యాంకర్ ఇన్నింగ్స్లు ఆడే కోహ్లి జట్టుకు భారమవుతాడనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. 2013 నుంచి ఐసీసీ ట్రోఫీలు సాధించట్లేదని టీమిండియా యాజమాన్యం, బీసీసీఐపై విపరీతమైన ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో మరికొన్ని నెలల్లో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్ కప్ ముందు కఠినమైన నిర్ణయాలు బీసీసీఐ తీసుకోనున్నట్లు సమాచారం.

టీమిండియా నుంచి విరాట్ కోహ్లిని తప్పించడమనేది సులువైన విషయం కాదు. క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అందుకే ఈ సున్నితమైన విషయాన్నినిర్వర్తించే బాధ్యతలను టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్కు అప్పగించినట్లు సమాచారం. కోహ్లికి అగార్కర్ నచ్చజెప్పేలా ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది.'ఇది చాలా సున్నితమైన విషయం. అందుకే ఈ విషయంలో ఎక్కువమంది పాల్గొనడానికి ఇష్టపడట్లేదు' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
టీ20 ఫార్మాట్కు తగ్గట్లుగా తన స్టైల్ను మార్చుకోమని కోహ్లికి అగార్కర్ ముందే తెలియజేశాడని సమాచారం. అఫ్గానిస్థాన్ సిరీస్లో దూకుడుగా ఆడటానికి ప్రయత్నించిన కోహ్లి ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. రెండు మ్యాచ్ల్లో 29 పరుగులే చేశాడు. ఇందులో ఓ డకౌట్ ఉంది. మరోవైపు యువ ఆటగాళ్లు సంచలన ప్రదర్శనలు చేస్తుండటంతో కోహ్లిని తప్పించాలని ఆలోచిస్తున్నారు.
యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, శివమ్ దూబె అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్లో సత్తాచాటారు. హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ గాయాల నుంచి కోలుకుని తిరిగొస్తున్నారు. దీంతో జట్టు కూర్పు సెలక్టర్లకు తలనొప్పిగా మారింది. అయితే ఐసీసీకి మే నెల మొదటి వారంలో వరల్డ్ కప్ ప్రొవిజినల్ స్క్వాడ్ను పంపించాల్సి ఉంది. ఈ సమయంలోపు ఐపీఎల్ 70 శాతం పూర్తవుతుంది. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేస్తారు. అప్పటిలోపు బీసీసీఐ తమ ఆలోచనలు మార్చుకునే అవకాశాలు లేకపోలేదు.