ప్రపంచ క్రికెట్లో అత్యంత సంపన్న బోర్డు ఏది అంటే భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అనే చెప్పాలి. ఒకానొక సమయంలో వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు కూడా కనీసం జీతం ఇవ్వలేని స్థితిలో ఉన్న బీసీసీఐ.. ఆ తర్వాత అనూహ్యంగా ఎదిగింది. ప్రస్తుతం సంపాదనలో మిగతా క్రికెట్ బోర్డులకు అందనంత ఎత్తులో నిలిచింది.
మరి సంపాదన పెరిగినప్పుడు ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కూడా పెరుగుతుంది కదా. ఈ లెక్కలను తాజాగా ప్రభుత్వం వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ ఏకంగా రూ.1159 కోట్ల ఆదాయ పన్ను చెల్లించినట్లు ప్రభుత్వం తెలియజేసింది. ఇది అంతకుముందు ఏడాది కన్నా 37 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

రాజ్యసభలో ఈ ప్రశ్న తలెత్తగా ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరీ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. గత ఐదేళ్లలో బీసీసీఐ నుంచి ప్రభుత్వానికి అందిన ఆదాయ పన్ను వివరాలను ఆయన సభకు తెలియజేశారు. బీసీసీఐ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.844.92 కోట్ల ఆదాయ పన్ను రూపంలో చెల్లించింది.
అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2019-2020 కన్నా ఇది కొంత తక్కువ. ఎందుకంటే ఆ సమయంలో బీసీసీఐ రూ.882.29 కోట్లు చెల్లించింది. అంతకుముందు ఏడాదిలో అంటే 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.815.08 కోట్ల ఆదాయ పన్ను బీసీసీఐ నుంచి వచ్చింది. అది అంతకుముందు 2017-18లో వచ్చిన రూ.596.63 కోట్ల కన్నా చాలా ఎక్కువ.
అంతేకాదు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ ఎప్పుడూ లేనంతగా ఏకంగా రూ.7606 కోట్ల ఆదాయం కళ్లజూసింది. ఈ సొమ్ములో రూ.3064 కోట్లు బోర్డు ఖర్చు పెట్టింది. అంతకుముందు ఏడాదిలో బీసీసీఐ ఆదాయం రూ.4735 కోట్లు కాగా.. ఖర్చు పెట్టింది రూ.3080 కోట్లు కావడం గమనార్హం. అంటే బీసీసీఐ ఆదాయం పెరిగింది కానీ.. ఖర్చులు పెద్దగా పెరగలేదన్నమాట.