BCCI Central Contract: భారత ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. బీసీసీఐ సాధారణంగా ఫిబ్రవరి నుంచి మార్చి నెలల్లో కేంద్ర ఒప్పందాన్ని ప్రకటిస్తుంది. కానీ ఈ సారి ఆలస్యం జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా బోర్డు రాబోయే ఒకట్రెండు రోజుల్లో కేంద్ర ఒప్పందాన్ని ప్రకటించవచ్చని వెలుగులోకి వస్తోంది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీ20 ఫార్మాట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన కోహ్లీ, రోహిత్ , జడేజాలను ఏ ప్లస్ కాంట్రాక్టు నుంచి తొలగించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. బీసీసీఐ ఏ ప్లస్ గ్రేడ్ లో ఎటువంటి మార్పులు చేసే అవకాశం లేదని సమాచారం.
సెంట్రల్ కాంట్రాక్టుకు సంబంధించి కీలక అప్డేట్
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుకు సంబంధించి వార్తలు వచ్చాయి. స్పోర్ట్స్ టాక్ నివేదిక ప్రకారం.. కేంద్ర ఒప్పందాన్ని రాబోయే ఒకటి నుంచి రెండు రోజుల్లో ప్రకటించవచ్చు. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏ ప్లస్ కేటగిరీలో ఎటువంటి మార్పులు చేయబోవడం లేదు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ఏ ప్లస్ గ్రేడ్ లో ఉన్నారు. కొత్త ఒప్పందం కోసం అన్ని పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయని.. త్వరలో దానిని ప్రకటిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

సెంట్రల్ కాంట్రాక్టులోకి శ్రేయస్ అయ్యర్
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోకి శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడం ఖాయం. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేశాడు. దీనితో పాటు గత కొంతకాలంగా దేశీయ క్రికెట్ లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. అయితే ఇషాన్ కిషన్ సెంట్రల్ కాంట్రాక్టులో తిరిగి రావడం కష్టంగా కనిపిస్తోంది. గతంలో దేశీయ క్రికెట్ లో పాల్గొనకపోవడంతో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరినీ కేంద్ర ఒప్పందం నుంచి తొలగించారు.