
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం టీమిండియా మెన్స్ హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్ కోచ్ సహా బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్ మరియు ఫీల్డింగ్ కోచ్ స్థానాలకు కూడా బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. వీటితో పాటుగా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో స్పోర్ట్స్ సైన్స్ మరియు మెడిసిన్ హెడ్ పదవులకు కూడా దరఖాస్తులు ఆహ్వానించింది. టీమిండియా హెడ్ కోచ్ పదవిపై కొంతకాలంగా చర్చ జరుగుతున్న సమయంలో బీసీసీఐ ఈ రోజు పలు పదవుల కోసం దరఖాస్తులు ఆహ్వానించడం విశేషం.
టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే వారికి అక్టోబర్ 26, 2021న సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. ఈ సమయం దాటితే.. బీసీసీఐ ఎలాంటి దరఖాస్తులను తీసుకోదు. ఇతర పదవుల కోసం నవంబర్ 3వ తేదీ వరకూ బీసీసీఐ సమయం ఇచ్చింది. ఇప్పటికే హెడ్ కోచ్ పదవికి టీమిండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ దాదాపు ఖాయమయ్యాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో రాహుల్ ఎంపిక ఖరారు అయినా.. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ జరగనుంది. రవిశాస్త్రి మాదిరిగా రాహుల్ ఎంపిక కూడా ఏకగ్రీవం కానుంది. రాహుల్ సహా ఇంకా ఎవరన్నా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేస్తారో లేదో చూడాలి.
టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటున్న విషయం తెలిసిందే. రవిశాస్త్రి పదవీకాలం నవంబరు 14తో ముగియనుంది. ఇప్పటికే శాస్త్రి కోచ్ పదవిలో నాలుగేళ్లుగా కొనసాగుతున్నాడు. మరోసారి ఆ బాధ్యతలు చేపెట్టేందుకు అతడు సముఖంగా లేదు. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా మెగా టోర్నీ అనంతరం తమతమ పదవుల నుంచి తప్పుకోనున్నారు. హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్.. బౌలింగ్ కోచ్గా పరాస్ మామ్బ్రే ఎంపిక లాంఛనం కానుంది. ఇక బ్యాటింగ్ కోచ్గా ప్రస్తుతం ఉన్న విక్రమ్ రాఠోడ్ అదే పదవిలో కొనసాగనున్నాడని సమాచారం. టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజీలాండ్ పర్యటనతో టీమిండియా కోచ్గా ద్రవిడ్ బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.
ఇప్పటికే అనేక మంది యువ ఆటగాళ్లు అండర్-19 స్థాయిలో రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలోనే మేటి ఆటగాళ్లుగా తయారైన సంగతి తెలిసిందే. కొందరు ప్లేయర్స్ ఇప్పుడు భారత జట్టులోనూ ఆడుతున్నారు. టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగుస్తున్న నేపథ్యంలో చాలా మంది ద్రవిడ్నే తర్వాతి కోచ్గా నియమించాలంటూ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా అతడిని ఒప్పించారని సమాచారం. మరోవైపు ద్రవిడ్ ఇటీవల శ్రీలంక పర్యటనలోనూ భారత జట్టు కోచ్గా సేవలందించిన సంగతి తెలిసిందే. గతంలో ఇండియా-ఏ జట్టుకు, శ్రీలంకలో పర్యటించిన టీమిండియాకు ద్రవిడ్ కోచ్గా వ్యవహరించాడు.