గతేడాది వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ. 125 కోట్ల నగదు బహుమతిని అందించింది. అయితే ఈ ప్రైజ్ మనీతో పాటు తాజాగా మరో విలువైన బహుమతిని కూడా అందించింది. జట్టులోని ప్రతీ ఆటగాడికి అత్యంత విలువైన డైమండ్ రింగ్స్ ను ప్రదానం చేసింది. అమెరికన్ స్పోర్ట్స్ లీగ్స్ అయిన ఎన్బీఏ, ఎన్ఎఫ్ఎల్ వంటి వాటి నుంచి స్ఫూర్తి పొంది ఈ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.
రీసెంట్ గా బీసీసీఐ.. నమాన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలోనే ప్లేయర్స్ కు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ వజ్రపు ఉంగరాలను ప్రదానం చేసింది. తాజాగా ఈ ప్రదానోత్సవానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ప్రత్యేకంగా విడుదల చేసింది. "టీ20లో అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమిండియాకు ఛాంపియన్స్ రింగ్ ను ప్రదానం చేస్తున్నాం. ఈ వజ్రాలు శాశ్వతంగా ఉండవచ్చు, కానీ ఈ విజయం కచ్చితంగా బిలియన్ల మంది హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి" అని బీసీసీఐ పేర్కొంది.

ఈ ఉంగరాలను వజ్రాలు, బంగారంతో రూపొందించారు. అలానే ఈ ఉంగరంపై భాగంలో టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ ఇండియా అనే అక్షరాలను లిఖించారు. దీంతో పాటే అశోక చక్రం గుర్తు కూడా వేశారు. ఇంకా ఉంగరానికి రెండు వైపులా ఆటగాళ్ల పేర్లు, జెర్సీ నంబర్లతో పాటు భారత జట్టు ఎంత తేడాతో ఏ ప్రత్యర్థులపై విజయాలు సాధించిందో కూడా ముద్రించారు. వీడియోలో రోహిత్ శర్మ, బుమ్రా, రిషభ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య ఈ ఉంగరాలను స్వీకరించినట్లు కనపడుతోంది. కాగా, టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించి టైటిల్ ను ముద్దాడింది.
వాటి నుంచి స్ఫూర్తి పొంది..
అమెరికన్ స్పోర్ట్స్ లీగ్స్ అయిన ఎన్బీఏ, ఎన్ఎఫ్ఎల్ వంటి వాటి నుంచి స్ఫూర్తి పొంది ఈ ఛాంపియన్స్ రింగ్ కల్చర్ ను ప్రారంభించింది బీసీసీఐ. ఎన్బీఏ తమ ఛాంపియన్స్ కు రింగ్ ప్రదానం చేసి సత్కరిస్తోంది. 1947 నుంచి ఈ ఆనవాయితినీ కొనసాగిస్తోంది. ప్రతీ సీజన్ లో సూపర్ బౌల్ విన్నర్స్ కు ఈ ప్రత్యేకమైన రింగ్ లను అందిస్తుంది.