
అహ్మదాబాద్: అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన యువ భారత జట్టు.. టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో సందడి చేసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారత అండర్ 19 ఆటగాళ్లంతా గ్రౌండ్లో సందడి చేశారు. స్టాండ్స్లో కూర్చొని ఇండియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ను వీక్షించారు. ఆటగాళ్లతోపాటు అండర్ 19 ఇండియా జట్టు ప్రధాన కోచ్ హృషికేష్ కనిట్కర్, ఇతర సహాయక సిబ్బంది కూడా మ్యాచ్ను చూశారు. మ్యాచ్ చూస్తున్న టీమిండియా అండర్ 19 ఆటగాళ్లతో బీసీసీఐ సెక్రటరీ జైషా, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్, కోశాధికారి అరుణ్ ధుమాల్, రాష్ట్ర క్రికెట్కు చెందిన మరికొందరు సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. అంతా కలిసి మ్యాచ్ను వీక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 35 సెకన్లపాటు ఉన్న ఆ వీడియోలో వీవీఎస్ లక్ష్మణ్, జైషా ఆటగాళ్ల మధ్యలో కూర్చొని మ్యాచ్ను చూడడాన్ని గమనించవచ్చు.
కాగా భారత్, వెస్టిండీస్ రెండే వన్డే మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు ప్రపంచకప్ గెలిచిన ఇండియా అండర్ 19 జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఘనంగా సత్కరించింది. అయితే మ్యాచ్కు ముందు టీమిండియా సీనియర్ జట్టును యువ ఆటగాళ్లు కలుస్తారని వార్తలు వచ్చినప్పటికీ అది జరగలేదు. కరోనా నిబంధనల కారణంగా అండర్ 19 జట్టు టీమిండియా సీనియర్ టీంను కలవలేకపోయింది. కాగా వెస్టిండీస్ గడ్డపై వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత అండర్ 19 జట్టు మంగళవారం బెంగళూరు చేరుకుంది. బెంగళూరు ఎయిర్పోర్టులో భారత అండర్ 19 జట్టుకు ఘనస్వాగతం లభించింది. అక్కడి నుంచి భారత అండర్ 19 జట్టు నేరుగా అహ్మదాబాద్ చేరుకుంది. అండర్ 19 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత యువ ఆటగాళ్లందరికీ ఒక్కొక్కొరికి 40 లక్షల రూపాయల చొప్పున బీసీసీఐ రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే టీం సహాయక బృందంలోని ఒక్కొక్కరికీ కూడా 25 లక్షల రూపాయల చొప్పును బీసీసీఐ రివార్డు ప్రకటించింది.
అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ను యువ భారత్ 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 189 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రాజ్ బవా 5, రవి కుమార్ 4 వికెట్లతో చెలరేగారు. ఇక లక్ష్య చేధనలో భారత బ్యాటర్లలో షేక్ రషీద్, నిశాంత్ సింధు హాఫ్ సెంచరీలు సాధించారు.