హైదరాబాద్: 'క్రీడాస్ఫూర్తి విషయంలో రవిచంద్రన్ అశ్విన్కు ఎటువంటి లెక్చర్ ఇవ్వం' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ని 'మన్కడింగ్' ద్వారా రనౌట్ చేయడంపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ నేపథ్యంలో కెప్టెన్గా, వ్యక్తిగతంగా అశ్విన్ తనను నిరాశపరిచాడని షేన్ వార్న్ పేర్కొన్నాడు. ఈ మేరకు వార్న్ తన ట్విట్టర్లో ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, కెప్టెన్లందరూ ఐపీఎల్ నిబంధనలకు లోబడి ఆడాలని అన్నాడు. ఆ సమయంలో అశ్విన్కు ఆ బంతి వేసే ఆలోచన లేదని.. అందుకే బట్లర్ను రనౌట్ చేశాడని.. దాన్ని డెడ్బాల్గా పరిగణించాల్సి ఉండేదని వార్న్ తెలిపాడు.
ఐపీఎల్లో ఇలాంటివి మంచిది కాదని బీసీసీఐని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. ఈ విజయం ఆటగాళ్ల మానసికస్థితిని చెడగొడుతుందని, క్రికెట్లో అన్నిటి కంటే క్రీడాస్ఫూర్తే ముఖ్యమని తెలిపాడు. భావితరాలకు ఆదర్శంగా ఉండాలని షేన్ వార్న్ సూచించాడు. అశ్విన్ క్రీడా సమగ్రతను కాపాడుతాడనుకుంటే నిరాశపరిచాడని.. ఈ ఘటనపై బీసీసీఐ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు షేన్ వార్న్ తన మరో ట్వీట్లో పేర్కొన్నాడు.
ఈ వివాదంపై బీసీసీఐ స్పందించింది. "క్రీడాస్ఫూర్తి గురించి అశ్విన్కు ఎటువంటి లెక్చర్ ఇవ్వం. ఆట నిబంధనలకు లోబడే అతడా ఆ పని చేశాడు. నిబంధనల ప్రకారం ఆడించేందుకు మైదానంలో అంపైర్లు, రిఫరీలు ఉన్నారు. అందుకే బీసీసీఐ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోదు. ఇక షేన్వార్న్ వ్యాఖ్యలు అంటారా? అతడు రాయల్స్ బ్రాండ్ అంబాసిడర్ అని తటస్థ వ్యక్తి కాదని గుర్తుంచుకోవాలి" అని అన్నారు.