
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2022 షెడ్యూల్పై అధికారిక ప్రకటన వచ్చేసింది. గురువారం జరిగిన ఇండియన్ ప్రీమియ్ లీగ్ (ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో లీగ్ షెడ్యూల్పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చి 26 నుంచి ఐపీఎల్ 15 సీజన్ ప్రారంభం కానుందని బీసీసీఐ ప్రకటించింది. మే 29న అహ్మదాబాద్లో జరగనున్న ఫైనల్ మ్యాచ్తో లీగ్ ముగియనుంది. ఇండియా, శ్రీలంక టెస్టు సిరీస్ ముగిసిన 11 రోజుల తర్వాత ప్రారంభం కానున్న ఐపీఎల్ ఈ సారి మొత్తం 70 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సారి ఐపీఎల్లో గతంలో కంటే రెండు జట్లు ఎక్కువగా చేరడంతో లీగ్ మ్యాచ్ల సంఖ్య కూడా పెరిగింది.
ఇక లీగ్ మ్యాచ్లన్నీ మహారాష్ట్రలోనే జరగనున్నాయి. ముంబై, పుణేలోని నాలుగు స్టేడియాలలో జరుగుతాయి. ముంబైలో 55 మ్యాచ్లు లీగ్ మ్యాచ్లు జరగనుండగా.. పుణేలో 15 మ్యాచ్లను నిర్వహించనున్నారు. ప్రతి జట్టు ముంబైలోని వాంఖడే, డీవై పాటిల్ స్టేడియాలలో 4 మ్యాచ్ల చొప్పున ఆడనుంది. అలాగే పుణేలోని బ్రబౌర్న్ స్టేడియం ఎంసీఏ స్టేడియంలో ప్రతి జట్టు 3 మ్యాచ్లు చొప్పున ఆడుతుంది. వాంఖడేలో 20, బ్రబోర్న్ 20, డీవై పాటిల్ స్టేడియం 15, ఎమ్సీఏ గ్రౌండ్లో 15 మ్యాచ్ల చొప్పున నిర్వహించనున్నారు. కాగా పూర్తి షెడ్యూల్ను బీసీసీఐ త్వరలోనే విడుదల చేయనుంది. అయితే స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించాలా? వద్దా? అనే అంశంపై బీసీసీఐ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.