
ఐపీఎల్ ఎక్కడంటే?
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఐపీఎల్ 15ను ఇండియాలోనే నిర్వహించాలా? లేక విదేశాలకు తరలించాలా? అనే డైలామాలో ప్రస్తుతం బీసీసీఐ ఉంది. అయితే బీసీసీఐ వర్గాల నుంచి తాజాగా వస్తున్న సమాచారం మేరకు మహారాష్ట్ర, గుజరాత్లో ఐపీఎల్ 15ను నిర్వహించనున్నారు. మహారాష్ట్రలోని 3 స్టేడియాలలో ఐపీఎల్ లీగ్ మ్యాచ్లన్నింటినీ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. ఇక ప్లేఆఫ్స్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్లను గుజరాత్లోని అహ్మదాబాద్ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిందని సమాచారం అందుతోంది. అయితే దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రేక్షకులకు అనుమతి
ఈ సారి ఐపీఎల్ మ్యాచ్లకు ప్రేక్షకులను కూడా అనుమతించే ఆలోచనలో బీసీసీఐ ఉందని సమాచారం. అయితే ఇది లీగ్ జరిగే సమయంలో ఆయా వేదికలు ఉండే రాష్ట్రాల్లో నమోదయ్యే కరోనా కేసుల సంఖ్యను బట్టి ఎంత మందిని అనుమతించాలనే విషయమై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుందట. ప్రస్తుతం మాదిరిగానే కరోనా కేసులు తగ్గితే మ్యాచ్లకు 25 % మంది ప్రేక్షకులను అనుమతించే ఆలోచనలో బీసీసీఐ ఉందని సమాచారం. లీగ్ సమయంలో కరోనా కేసులు భారీగా తగ్గితే ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఒక వేళ తగ్గకుండా పెరిగితే ప్రేక్షకులను ఎవరినీ అనుమతించకుండా ఉండే అవకాశం కూడా ఉంది.

ఐపీఎల్ షెడ్యూల్
కొంత కాలం క్రితం ఐపీఎల్ షెడ్యూల్పై బీసీసీఐ కార్యదర్శి జైషా క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారం మార్చి చివరి వారం నుంచి మే చివరి వారం వరకు ఐపీఎల్ 15 కొనసాగనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి ఐపీఎల్ను షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేయాలని బీసీసీఐ పట్టుదలగా ఉంది. దీంతో భారత్లో కాకపోతే విదేశాల్లోనైనా సరే ఐపీఎల్ అనుకున్న టైమ్కు జరగడం ఖాయంగా కనిపిస్తుంది.

ఫిబ్రవరిలో మెగా వేలం
ఫిబ్రవరిలో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. 12, 13వ తేదీల్లో వేలం జరుగుతుంది. ఇప్పటికే ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇందుకోసం 10 జట్లు తమ రిటెన్షన్ జాబితాను కూడా ఇప్పటికే బీసీసీఐకి సమర్పించాయి. దీంతో ఐపీఎల్ మెగా వేలానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మెగా వేలంలో 1214 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు.


Click it and Unblock the Notifications












