హైదరాబాద్: హైదరాబాద్ కెప్టెన్ అంబటి రాయుడిపై బీసీసీఐ రెండు మ్యాచ్ల నిషేధం విధించింది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో భాగంగా జనవరి 11న విశాఖపట్నం వేదికగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్లో బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో త్వరలో జరగనున్న విజయ హాజారే ట్రోఫీ తొలి రెండు మ్యాచ్లకు రాయుడు దూరం కానున్నాడు.
హైదరాబాద్ కెప్టెన్ అంబటి రాయుడికి బీసీసీఐ నోటీసులు
కర్ణాటక-హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అంఫైర్ల పొరపాటు కారణంగా జరిగిన ఓ ఘటన వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో అంపైర్ తప్పిదం వల్ల గందరగోళం నెలకొంది. కర్నాటక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రెండో ఓవర్లో సిరాజ్ బౌలింగ్లో కరుణ్ నాయర్ మిడ్ వికెట్ వైపు ఆడి రెండు పరుగులు చేశాడు.
అయితే బంతిని ఆపే క్రమంలో మెహిదీ హాసన్ కాలు బౌండరీ లైన్ రోప్ను తాకినట్టు స్పష్టమైంది. దీనిని ఫీల్డ్ అంపైర్లు గమనించలేదు. దీంతో రెండు పరుగులు మాత్రమే ఇచ్చారు. ఇన్నింగ్స్ ముగిశాక హైదరాబాద్ 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే ఆట ఆరంభానికి ముందు కర్ణాటక కెప్టెన్ వినయ్ కుమార్ ఈ విషయాన్ని థర్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కర్ణాటక జట్టు స్కోరులో మరో రెండు పరుగులు జత చేసి స్కోరును 205/5గా మార్చారు.
BCCI issues notice to Hyderabad captain Ambati Rayadu and Manager Kishan Rao after disagreement over an umpiring decision in the T20 match against Karnataka on 11.1.18. Seeks reply within 7 days
— ANI (@ANI) January 19, 2018
ఈ విషయం హైదరాబాద్ బ్యాట్స్మెన్కు ఆట మధ్యలో తెలిసింది. దాంతో కెప్టెన్ అంబటి రాయుడు అంపైర్లతో వాదనకు దిగాడు. మరోవైపు వినయ్ కుమార్ కూడా మైదానంలోకి వచ్చి అంపైర్లతో చర్చించాడు. అయితే హైదరాబాద్ వాదనను పట్టించుకోని అంపైర్లు ఆటను కొనసాగించారు.
చివరకు హైదరాబాద్ కూడా సరిగ్గా 203 పరుగులే చేయడంతో ఆ పరుగుల ప్రాధాన్యం పెరిగింది. కర్ణాటకకు రెండు పరుగులు అదనంగా కలపక పోయి ఉంటే మ్యాచ్ టై అయ్యేది. ఆ రెండు పరుగులు కర్ణాటకకు అదనంగా కలిపిన తీరుపై అభ్యంతరం వ్యక్తం జేస్తూ.. సూపర్ ఓవర్ ఆడించమని కోరగా...అంపైర్లు అంగీకరించకుండా కర్ణాటకను విజేతగా ప్రకటించారు.
మ్యాచ్ ముగిశాక కూడా హైదరాబాద్ ఆటగాళ్లు మైదానం వీడలేదు. దీంతో అంపైర్ నిర్ణయంతో విభేదించడంపై వివరణ ఇవ్వాలని బోర్డు రాయుడిని ఆదేశించింది. రాయుడి వివరణతో సంతృప్తి చెందని బీసీసీఐ అతడిపై రెండు మ్యాచ్ల నిషేధం విధించింది. హైదరాబాద్ జట్టు మేనేజర్ కృష్ణారావుకు కూడా బీసీసీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.