టీమిండియా హెడ్ కోచ్ పదవి దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్గా ఎవరు నియమితులవుతారనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. విదేశీ క్రికెటర్లపై బీసీసీఐ ఎంతో ఆసక్తిగా ఉందని తొలుత జోరుగా ప్రచారం సాగింది. కానీ దేశవాళీ క్రికెట్పై లోతైన అవగాహన ఉన్న వ్యక్తికే అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తుందని తర్వాత తెలిసింది.
ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా ఓ సందర్భంలో వెల్లడించడంతో భారత మాజీ క్రికెటరే కొత్త కోచ్గా ఎంపిక అవుతాడని స్పష్టమైంది. అయితే తీవ్ర ఒత్తిడితో ఉండే టీమిండియా కోచ్ పదవిపై ప్రముఖ మాజీ క్రికెటర్లు ఎక్కువగా ఆసక్తి చూపలేదు. దీంతో కోచ్ పదవికి ఎవరు అప్లై చేశారనే విషయంపై స్పష్టత లేదు. అయితే నిన్నటితో దరఖాస్తు ముగియడంతో షాకింగ్ విషయాలు బయటకువచ్చాయి.

టీమిండియా కోచ్ పదవికి మూడు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో ఎన్నో ఫేక్ అప్లికేషన్లు ఉండటం గమనార్హం. అప్లికేషన్లలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి ప్రముఖల పేర్లు కూడా ఉన్నాయని జాతీయ మీడియా పేర్కొంది. దీంతో బీసీసీఐ అర్హత ఉన్న దరఖాస్తుదారులను కన్ఫార్మ్ చేసుకోవడం కోసం పర్సనల్గా మెయిల్స్ పంపుతుంది.
ప్రముఖుల పేర్లతో బీసీసీఐకి దరఖాస్తులు రావడం ఇదేం ప్రథమం కాదు. 2022లో కూడా ఇదే జరిగింది. 5000కు పైగా వచ్చిన అప్లికేషన్లలో ఒరిజనల్ ఎంతో తెలుసుకోవడానికి బీసీసీఐకి ఎంతో సమయం పట్టింది. ఈ సారి కూడా అదే పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. కాగా, కొత్త కోచ్ పదవి రేసులో గౌతమ్ గంభీర్ ముందున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఫైనల్ అనంతరం జై షాతో కలిసి గంభీర్ సుదీర్ఘంగా చర్చించడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి.
టీమిండియా కొత్త కోచ్ 2027లో సౌతాఫ్రికా వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ వరకు సేవలు అందించాల్సి ఉంటుంది.