
మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఈసారి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లపై క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఏడాది జూన్ నెలలో ప్రపంచ క్రికెట్లో ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో ఆసీస్, ఇంగ్లండ్ ప్లేయర్లు వచ్చే ఏడాది ఐపీఎల్ ఆసాంతం ఆడతారా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఆందోళనలో ఉన్న ఫ్రాంచైజీలకు బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్ అందినట్లు సమాచారం. ఈ రెండు దేశాల ఆటగాళ్లు ఐపీఎల్ సీజన్ మొత్తం అందుబాటులో ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది.
గతంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడటం కన్నా యాషెస్ ఆడేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ఈ రెండు దేశాల ఆటగాళ్ల ఎవైలబిలిటీపై అనుమానాలు తలెత్తాయి. వీటిని పటా పంచలు చేస్తూ బీసీసీఐ అధికారికంగా ఫ్రాంచైజీలకు సందేశాలు పంపింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు పూర్తిగా ఐపీఎల్ ఆడతారని స్పష్టం చేసింది. అయితే ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు ఎంపికైన వాళ్లు మార్చి 30 నుంచి, షెఫీల్డ్ షీల్డ్ ఆడుతున్న వారు మార్చి 28 నుంచి అందుబాటులో ఉంటారని స్పష్టం చేసింది.
అలాగే ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా పూర్తిగా ఐపీఎల్లో పాల్గొంటారని వెల్లడించింది. అదే సమయంలో బంగ్లాదేశ్, శ్రీలంక ఆటగాళ్లు మాత్రం ఈ సీజన్ మొత్తం ఆడరని ప్రకటించింది. బంగ్లాదేశ్, ఐర్లాండ్ మధ్య సిరీస్ నేపథ్యంలో.. ఈ సిరీస్కు ఎంపికైన ఆటగాళ్లు ఏప్రిల్ 8 నుంచి మే 1 వరకు అందుబాటులో ఉంటారని తెలిపింది. శ్రీలంక ఆటగాళ్లు కూడా ఏప్రిల్ 8 నుంచే ఫ్రాంచైజీలతో కలుస్తారని వివరించింది. ఈ వార్త విన్న ఫ్రాంచైజీలు ఊపిరి పీల్చుకున్నాయి. ఎందుకంటే ఈ మినీ వేలంలో అందరి చూపూ ఉన్న బెన్ స్టోక్స్, శామ్ కర్రాన్, కామెరూన్ గ్రీన్ తదితర ఆటగాళ్లందరూ ఇంగ్లండ్, ఆస్ట్రేలియాకు చెందిన వారే కదా.