
హైదరాబాద్: ఐపీఎల్ 2018 అభిమానుల ముందుకు కొత్తగా కనిపించనుంది. రెండేళ్ల నిషేదానంతరం పునరాగమనం చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టులతో పాటు మరో కొత్త సౌకర్యాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఇవ్వనుంది. ఇప్పటివరకు డీఆర్ఎస్(డెసిషన్ రివ్యూ సిస్టమ్) అనేది లేని ఐపీఎల్లో ఈ సీజన్ నుంచి అమలులోకి తీసుకురానుంది బీసీసీఐ.
ఇంగ్లాండ్ టూర్లో భాగంగా తీసుకుంటున్న నిర్ణయాలతో పాటుగా డీఆర్ఎస్ నిర్ణయాన్ని సైతం ప్రకటించింది బీసీసీఐ. 'అంతర్జాతీయ క్రికెట్లోనే వాడుతున్నప్పుడు అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ఆడుతున్న ఐపీఎల్లోనూ ఇదే పద్ధతి వాడుకోవచ్చు. అదే నేపథ్యంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం' అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
ఐపీఎల్ను దృష్టిలో ఉంచుకుని దేశంలోని అత్యున్నత స్థాయి 10 మంది అంపైర్లతో గతేడాది డిసెంబరు నెల విశాఖపట్టణంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గాను ఐసీసీకి పరిధిలో ఉన్న మాజీ ఆస్ట్రేలియన్ ఫేసర్ ప్రస్తుత కోచ్ అయిన పాల్ రీఫిల్ సైతం పాల్గొన్నాడు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఐపీఎల్ టోర్నీలో ఇలాంటి కొత్త నియమాన్ని పెడితే బాగుంటుందంటూ సూచించాడు.
ఇప్పటివరకు భారత దేశీవాలీ క్రికెట్లో డీఆర్ఎస్ అనేది లేదు. ప్రత్యామ్నాయంగా స్థానిక అంపైర్లను నియమించి మ్యాచ్ను నిర్వహిస్తున్నారు. ఇలా కాకుండా టెక్నాలజీ వాడుకోవాలంటూ సదస్సులో పాల్గొన్న తోటి అంపైర్లు సూచించారని సమావేశానికి వచ్చిన స్థానిక అంపైర్ ఒకరు పేర్కొన్నారు. టీ 20లీగ్లో డీఆర్ఎస్ వాడుకున్న రెండో దేశం భారత దేశం. మొదటి స్థానంలో పీఎస్ఎల్లో ఇదే పద్ధతి వినియోగించుకుంటున్న పాకిస్థాన్ ఉంది.