భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు అంత గొప్పగా లేవు. చాలాకాలంగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దిగజారుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ రెండు దేశాల మధ్య క్రికెట్లో ద్వైపాక్షిక సిరీసులు జరగడం లేదు. అయితే తాజాగా జమ్మూకాశ్మీర్లో పాకిస్తాన్కు చెందిన కొందరు టెర్రరిస్టులు దాడి చేశారుప. అనంతనాగ్లో జరిగిన ఈ దాడిలో ముగ్గురు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారు.
ఈ వార్త విన్న చాలా మంది అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. అసలు పాకిస్తాన్తో క్రికెట్ ఆడటమే మానేయాలని, ద్వైపాక్షిక సిరీసులే కాకుండా ఆసియా కప్ వంటి మల్టీ నేషనల్ టోర్నీల్లో కూడా పాక్తో ఆడకూడదని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఈ విషయంపై స్పందించారు. ఈ రెండు దేశాల మధ్య 2012 నుంచి ద్వైపాక్షిక సిరీసులు జరగడం లేదనే సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో భారత్, పాకిస్తాన్ కేవలం ఏసీసీ, ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. ఇటీవలే శుక్లా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ఇద్దరూ రెండ్రోజుల లాహోర్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన తర్వాత మాట్లాడిన వీళ్లిద్దరూ.. భారత ప్రభుత్వం అంగీకరిస్తేనే పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీసులు ఆడతామని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో అనంతనాగ్ దాడి అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురు ఆర్మీ జవాన్ల గౌరవార్ధం టీమిండియా ప్లేయర్లు అందరూ నల్ల ఆర్మ్బ్యాండ్లు ధరించాలని ఫ్యాన్స్ కోరారు. అలాగే పాకిస్తాన్తో ఆడటం పూర్తిగా బాయ్కాట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన శుక్లా.. టెర్రరిస్టులపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని, గత 20 ఏళ్లుగా ప్రపంచంలోని అన్ని దేశాలు ఉగ్రవాదంపై పోరాడుతూనే ఉన్నాయని తెలిపారు.

'పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయినా సరే వాళ్లు ఉగ్రవాదులకు సహాయం చేయడం వల్ల వాళ్లకు, అలాగే ప్రపంచానికి ఎలాంటి ఉపయోగం లేదు. దేశం తరఫున పోరాడుతున్న ఆర్మీ, పోలీసు అధికారులకు మేం సెల్యూట్ చేస్తున్నాం. ఇక క్రికెట్ విషయంలో పాలసీ చాలా స్పష్టంగా ఉంది. మేం పాక్తో ద్వైపాక్షిక సిరీసులు ఆడటం జరగదు' అని శుక్లా తేల్చిచెప్పారు.