13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించుతూ విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టును ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. భారత ఆటగాళ్లతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ముచ్చటించారు. వాళ్లతో కలిసి అల్పాహారం తిన్నారు. బుమ్రా కొడుకును మోదీ ఎత్తుకుని ఆడించడం విశేషం. అయితే ఈ స్పెషల్ డే ఎప్పటికీ గుర్తుండేలా ప్రధాని మోదీకి బీసీసీఐ ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చింది.
'ఇండియా ఛాంపియన్' జెర్సీని మోదీకి బీసీసీఐ బహుకరించింది. నరేంద్రలోని మొదటి రెండు లెటర్స్ 'NA'ను, అలాగే మోదీలో తొలి రెండు అక్షరాలను 'MO'ని తీసుకుని నమో (NAMO) పేరుతో జెర్సీని సిద్ధం చేసింది. ఇక జెర్సీ నంబర్ 1ను మోదీకి బీసీసీఐ అందించింది. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

''ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని ఆయన అధికారిక నివాసంలో విజేతగా నిలిచిన భారతజట్టు కలుసుకుంది. మీ స్ఫూర్తిదాయకమైన మాటలు, టీమిండియాకు మీరు అందించిన అమూల్యమైన మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు'' అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. 2023 వన్డే వరల్డ్ కప్ను రోహిత్ సేన తృటిలో చేజార్చుకున్న సమయంలో ప్రధాని మోదీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్కు వచ్చిన విషయం తెలిసిందే. ఓటమి బాధలో ఉన్న ఆటగాళ్లను మోదీ ఓదార్చారు. ఓటమిని మరిచి ముందుకు సాగాలని టీమిండియాలో స్ఫూర్తి నింపారు.
కాగా, 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణ తెరపడిన అయిదు రోజులకు కప్ ఇంటికొచ్చిన విషయం తెలిసిందే. వెస్టిండీస్లోని భీకర తుఫాన్ కారణంగా టీమిండియా నాలుగు రోజులు బార్బడోస్లోనే ఉంది. అయితే బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో భారత ఆటగాళ్లు గురువారం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. తర్వాత హోటల్కు చేరుకుని కాసేపు సేద తీరి ప్రధాని మోదీ నివాసానికి వెళ్లారు. కాగా, మోదీతో భేటీ ముగిసిన అనంతరం ముంబైకు బయలుదేరారు. కాసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ చేయనున్నారు. ఆ తర్వాత వాంఖడేలో సన్మాన కార్యక్రమం జరుగుతుంది.