ప్రతిష్ఠాత్మక క్రికెట్ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన టీమిండియా కోచ్ ప్రకటనకు ఆదరణ కరువైంది. భారత జట్టు కోచ్ పదవిపై దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు ఆసక్తి చూపట్లేదు. ఇతర బోర్డుల కంటే జీతభత్యాలు, అలవెన్స్లు ఎక్కువగా ఇస్తున్నా ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోలేక కొందరు, తక్కువ పనితో ఎక్కువ ఆదాయం వచ్చే ఫ్రాంచైజీ క్రికెట్తో మరికొందరు కోచ్ పదవికి దరఖాస్తు చేయలేదు.
కేవలం గౌతమ్ గంభీర్ మాత్రమే కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడని తెలుస్తోంది. దీంతో గంభీర్ ఎంపిక ఇక లాంఛనమే. అయితే గంభీర్ను మంగళవారం మధ్యాహ్నం క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూ చేయనుంది. జూమ్ కాల్ ద్వారా గంభీర్తో కమిటీ మాట్లాడనుంది. కమిటీలో అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజపే, సులక్షణ నాయక్లు ఉన్నారు.

క్రికెట్ అడ్వజయరీ కమిటీ టీమిండియా కోచ్తో పాటు సెలక్టర్ను ఎంపిక చేసే పనిలో ఉంది. సలీల్ అంకోలా స్థానంలో మరో సెలక్టర్ భర్తీ చేయనుంది. ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో పాటు అంకోలా వెస్ట్ జోన్కు చెందినవారు. కాబట్టి కొత్తగా ఎంపిక చేసే సెలక్టర్ను నార్త్ జోన్ నుంచి ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇక టీమిండియా కోచ్ పదవి విషయానికొస్తే.. రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్ను ఎంపిక చేయడానికి మే వరకు బీసీసీఐ అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరింది. ద్రవిడ్ వారసుడిగా ఆస్ట్రేలియన్లు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ పేర్లు తొలుత వినిపించాయి. కానీ దేశవాళీ క్రికెట్పై లోతైన అవగాహన ఉన్నవాళ్లే కోచ్గా ఎంపిక చేస్తామని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా పేర్కొనడంతో ఆ వార్తలకు బ్రేక్లు పడ్డాయి. కాగా, టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత రాహుల్ ద్రవిడ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటాడు.కొత్తగా బాధ్యతలు అందుకునే టీమిండియా కోచ్ 2027 డిసెంబర్ 31 వరకు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.