తప్పించుకున్న వైభవ్ సూర్యవంశీ.. పట్టుబడ్డ రాజస్థాన్ రాయల్స్ మేనేజర్
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గౌహతిలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్లో కూర్చొని మొబైల్ ఫోన్ వాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐపీఎల్ రూల్స్ ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్లో కమ్యూనికేషన్ పరికరాలను వాడటం నిషేధం. దీనిపై స్పందించిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం వెంటనే విచారణ చేపట్టింది.
మెడికల్ కారణాల నేపథ్యంలో తప్పిన ముప్పు
ఈ ప్రోటోకాల్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ బీసీసీఐ రోమీ భిందర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. తనకు ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగానే అత్యవసరంగా ఫోన్ వాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. రోమీ భిందర్ వాదనతో సంతృప్తి చెందిన ఏసీఎస్యూ ఇన్వెస్టిగేటర్లు, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదని భావించారు. దీంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకోకుండా కేవలం జరిమానా విధించి, భవిష్యత్తులో ఇలా జరగకూడదని హెచ్చరికతో వదిలేశారు.

వైభవ్ సూర్యవంశీపై బోర్డు ఉదారత
ఫోటోలో రోమీ భిందర్ పక్కనే కూర్చుని ఫోన్ వైపు చూస్తున్న యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బీసీసీఐ నిర్ణయించింది. దీనిపై ఓ బోర్డు అధికారి మాట్లాడుతూ.. "వైభవ్ ఇంకా చిన్న అబ్బాయి. అతనికి నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఫ్రాంచైజీపై ఉంది. అంతేకానీ ఓ యువ ఆటగాడిని ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పెట్టడం లేదా భయపెట్టడం సరికాదు" అని స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదం నుంచి వైభవ్కు పూర్తి క్లీన్ చిట్ లభించింది.
ఏమిటా నిబంధన?
ఐపీఎల్ రూల్ బుక్ ప్రకారం.. 'ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్ ఏరియా' (PMOA) లోకి ఫోన్లను అనుమతించరు. టీమ్ మేనేజర్లకు మొబైల్ వాడే వెసులుబాటు ఉన్నప్పటికీ.. అది కేవలం డ్రెస్సింగ్ రూమ్కే పరిమితం. డగౌట్లో ఆడుతున్న ప్లేయర్లతో పాటు సిబ్బంది ఎవరూ ఎలక్ట్రానిక్ పరికరాలను వాడకూడదు. అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకు బీసీసీఐ ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. తాజాగా జరిగిన ఈ ఘటన ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications