
ఆసియా XIలో నలుగురు:
ఆసియా ఎలెవన్ జట్టు కోసం భారత్ నుంచి నలుగురు క్రికెటర్లని పంపాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయించినట్లు సమాచారం తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఓపెనర్ శిఖర్ ధావన్, పేసర్ మహ్మద్ షమీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్లు ఆసియా ఎలెవన్లో ఆడేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

బీసీసీఐ గ్రీన్ సిగ్నల్:
బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపిన సమాచారం ప్రకారం... ఆసియా ఎలెవన్ తరఫున జరిగే రెండు మ్యాచ్లలో విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, శిఖర్ ధావన్, కుల్దీప్ యాదవ్లు ఆడేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆమోదించారట. ఆసియా ఎలెవన్ జట్టుకు కోహ్లీ నాయకత్వం వహించనున్నారట. ఆటగాళ్ల షెడ్యూల్ని పరిశీలించాకే బంగ్లాదేశ్ బోర్డుకు దాదా సమాచారం తెలిపారట. 'బీసీబీకి గంగూలీ ఆటగాళ్ల జాబితా పంపించారు. ఆసియా ఎలెవన్ జట్టుకు కోహ్లీ, ధావన్, షమీ, కుల్దీప్ ప్రాతినిధ్యం వహించనున్నారు' అని బీసీసీఐ సంబంధిత అధికారి ఒకరు ఇదివరకే పేర్కొన్న విషయం తెలిసిందే.

పాక్ ఆటగాళ్లకు నో ఛాన్స్:
ఆసియా ఎలెవన్ జట్టులో పాకిస్థాన్ ప్లేయర్లు కూడా ఉంటారని, భారత ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం ఉందని తొలుత వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన బీసీసీఐ సంయుక్త కార్యదర్శి జయేష్ జార్జ్ ఈ మ్యాచ్ల్లో పాక్ ఆటగాళ్లు ఉండరని స్పష్టం చేశాడు. దీంతో బీసీసీఐ తమ క్రికెటర్లను పంపనుంది. మరోవైపు తమ ప్లేయర్స్ పాక్ సూపర్ లీగ్లో బిజీగా ఉండడంతోనే పంపలేకపోతున్నామని పాక్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.

చివరి వన్డేకు దూరం:
షేక్ మజీబుర్ రహ్మన్ వందో జయంతి వేడుకల సందర్భంగా ఈ టీ20 సిరీస్ని నిర్వహించబోతున్నట్లు గత ఏడాది బంగ్లాదేశ్ ప్రకటించింది. ఐసీసీ అనుమతిని బీసీబీ కోరగా.. అధికారికంగా టీ20 హోదాని ఇచ్చింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మార్చి 12 నుంచి 18 వరకూ మూడు వన్డే సిరీస్ జరగనుంది. దాదా నిర్ణయంతో సఫారీలతో జరిగే చివరి వన్డేకు ఈ నలుగురు క్రికెటర్లు (కోహ్లీ, ధావన్, షమీ, కుల్దీప్) దూరం కానున్నారు.


Click it and Unblock the Notifications












