
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం సుప్రీంకోర్టులో ఓ మోషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న బీసీసీఐ కాన్స్టిట్యూషన్లోని ఆరు నిబంధనలను మార్చే విషయమై తక్షణం విచారణ జరపాలని బీసీసీఐ సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఇక వచ్చే వారంలోగా ఈ కేసు విచారణకు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ పదవీకాలం పొడిగించబడింది. అలాగే సెక్రటరీ జై షాతో పాటు అతని పదవీకాలం సెప్టెంబర్ 2022లో ముగుస్తుంది. 2019లో బీసీసీఐ జనరల్ బాడీ వార్షిక సమావేశంలో ఆరు సవరణలను ప్రతిపాదించారు. వాటిలో కీలకమైంది బీసీసీఐ, స్టేట్ బోర్డు ఆఫీస్ హోల్డర్లు (ప్రెసిండెంట్, కార్యదర్శులు) వరుసగా ఆరేళ్లకు మించి ఆ స్థానాల్లో పనిచేయకుండా నిషేధించే బోర్డు కాన్స్టిట్యూషన్లోని రూల్ 6ను సవరించాలని ప్రతిపాదించడం.
ప్రస్తుత నిబంధనల ప్రకారం గరిష్ఠంగా ఆరేళ్లపాటు (ప్రెసిడెంట్, కార్యదర్శి, ఇతర ఆఫీస్ హోల్డర్లు) పదవిలో కొనసాగిన తర్వాత.. తప్పకుండా వైదొలగాలి. బీసీసీఐలో గానీ, స్టేట్ క్రికెట్ సంస్థలో ఉన్నవారు గానీ, రెండింట్లో కలిసి ఆరేళ్లుగా పదవులు అనుభవించనవారు తప్పకుండా వైదొలిగి మూడేళ్ళపాటు "కూలింగ్ ఆఫ్ పీరియడ్"ని అనుభవించాలి. ఈ మూడేళ్ల పాటు వారు ఏ స్టేట్ బోర్డులో గానీ, బీసీసీఐలో గానీ ఎలాంటి పదవులు చేపట్టకూడదు. దీంతో ప్రస్తుత బీసీసీఐ లేదా స్టేట్ బోర్డులలో ప్రెసిడెంట్, కార్యదర్శి, ఇతర ఆఫీసు హోల్డర్ల పదవుల్లో ఉన్నవారు.. ఆరేళ్ల తర్వాత తిరిగి మళ్లీ మూడేళ్లపాటు ఎన్నికకాకుండా ఈ రూల్ అడ్డుకుంటుంది. ఈ రూల్ వల్ల ప్రస్తుతం గంగూలీ, జైషా తమ పదవులు కోల్పోయే వీలుంది. ఇక 2013నుండి గుజరాత్ క్రికెట్ అసోసియేషన్లో జై షా అధికారిగా ఉన్నాడు. అలాగే గంగూలీ 2014నుండి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడిగా, ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక బీసీసీఐ ప్రతిపాదించిన సవరణలను గతంలోనే సుప్రీం కోర్టు వద్దకు తీసుకెళ్లినా కోర్టు ఇంకా విచారణ జరపలేదు. అలాగే వారిని పదవి నుండి తొలగించడానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పొడిగించిన పదవీకాలంలో గంగూలీ, జై షా కొనసాగుతున్నారు.
ఇకపోతే బీసీసీఐ ప్రతిపాదించిన ప్రధాన వసరణ ఏంటంటే.. బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, స్టేట్ బోర్డులో పదవుల్లో ఉన్న ఆఫీసు బేరర్లలోని అధ్యక్షుడు, కార్యదర్శికి ఆరేళ్ల కాలపరిమితిని పూర్తిగా ఎత్తివేస్తారు. తద్వారా వారు ఎన్నాళ్లపాటైన పదవిలో కొనసాగే వీలుంటుంది. వారి మీద కూలింగ్ పీరియడ్ ఉండదు. ప్రతి మూడేళ్లకోసారి నిర్వహించే ఎన్నికల్లో ఆరేళ్ల తర్వాత మళ్లీ వారు పోటీ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ ఈ సవరణకు సుప్రీంకోర్టు ఓకే చెబితే.. గంగూలీ, జై షా తమ పదవుల్లో సుదీర్ఘకాలం ఉండే అవకాశముంటుంది.