ఈ నెల జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత జట్టు ప్లేన్ జెర్సీలో కనిపించనుంది. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియా జెర్సీకి కొత్త స్పాన్సర్స్ను బీసీసీఐ పట్టుకోలేకపోయింది. ఇంతకాలం టీమిండియా జెర్సీ స్పాన్సర్గా బైజూస్ ఉంది. నవంబరు వరకు ఈ కాంట్రాక్ట్ ఉండగా.. బైజూస్ దీని నుంచి తప్పుకుంది.
ఇలా బైజూస్ అర్ధంతరంగా తప్పుకోవడంతో మరో కొత్త స్పాన్సర్ను పట్టుకోవడానికి బీసీసీఐ ప్రయత్నిస్తోంది. అయితే ఇకపై తక్కువ సమయానికి చిన్న కంపెనీలకు ఈ అవకాశం ఇవ్వకుండా.. ఎక్కువ కాలం నిలిచే డీల్స్ మాత్రమే చేసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే టూల్ కిట్ స్పాన్సర్షిప్ కోసం ఐదేళ్లపాటు ఆదిదాస్తో డీల్ చేసుకుంది.

తాజాగా డబ్ల్యూటీసీ కోసం రెడీ అవుతున్న టీమిండియా ఆటగాళ్ల జెర్సీపై ఆదిదాస్ లోగో, బీసీసీఐ లోగో మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ స్పాన్సర్ విషయంలో బీసీసీఐ జరుపుతున్న చర్చలు ఇంకా సఫలం కాలేదని తెలుస్తోంది. 'చిన్న చిన్న డీల్స్ చేసుకోవడం కన్నా కూడా.. ప్రముఖ కంపెనీలతో లాంగ్ టర్మ్ డీల్స్ చేసుకోవడమే భారత క్రికెట్కు బాగుంటుందని అనుకుంటున్నాం' అని ఒక బీసీసీఐ అధికారి తెలిపారు.
ఇంతకాలం బీసీసీఐ స్పాన్సర్షిప్స్ ద్వారా ఒక్కో ఐసీసీ మ్యాచ్కు రూ.1.5 కోట్లు, ద్వైపాక్షిక అంతర్జాతీయ మ్యాచ్కు రూ.4.6 కోట్లు సంపాదించేది. అయితే ప్రస్తుత కాలంలో ఐసీసీ టోర్నీలకు ప్రాధాన్యం పెరిగిన సంగతి తెలిసిందే. ఏటా డబ్ల్యూటీసీ జరగనున్న నేపథ్యంలో.. వన్డే వరల్డ్ కప్ మొదలయ్యే సమయానికి మంచి స్పాన్సర్ లభిస్తారని బీసీసీఐ భావిస్తోంది. అప్పటి వరకు కొంత నష్టం వచ్చినా బీసీసీఐకి చాలా చిన్నదే.
ఈ ధీమాతోనే కొత్త స్పాన్సర్ కోసం టెండర్లు పిలిచే ఆలోచనను కూడా బీసీసీఐ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. లేదంటే మరేదైనా కంపెనీతో షార్ట్ టర్మ్ డీల్ చేసుకుందామని కూడా కొందరు బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.