శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఊహించనట్లుగానే నయా కోచ్ గౌతమ్ గంభీర్ మార్క్ జట్టుపై స్పష్టంగా కనిపించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సీనియర్ల ఆటగాళ్లను కొనసాగిస్తూ యువకులకు అవకాశం ఇచ్చింది. జులై 27 నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా నియమించింది.
జట్టులో కొనసాగుతున్నప్పటికీ హార్దిక్ పాండ్యకు సారథి బాధ్యతలు అందివ్వలేదు. వైస్ కెప్టెన్గానూ ఎంపికకాలేదు. ఇటీవల జింబాబ్వే పర్యటనను విజయవంతంగా ముగించిన శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడం గమనార్హం. ఇక ఆగష్టు 2 నుంచి మొదలయ్యే మూడు వన్డేల సిరీస్కు రోహిత్ శర్మ సారథ్యంతో జట్టును బీసీసీఐ ప్రకటించింది.

వన్డే సిరీస్కు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య ఇద్దరూ జట్టులో లేరు. అయితే వారిద్దరిని విశ్రాంతి కోసమే పక్కనపెట్టలేదని సమాచారం. టీ20ల్లో చెలరేగే సూర్యకు వన్డే ఫార్మాట్లో పేలవమైన రికార్డు ఉంది. 37 వన్డేలు ఆడిన సూర్య 25 సగటుతో 773 పరుగులే చేశాడు. గత వన్డే వరల్డ్ కప్లో అతని ప్రదర్శనపై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు హార్దిక్ టీ20ల్లో పునరాగమనం చేసినప్పటికీ వన్డే ఫార్మాట్కు తగ్గట్లుగా ఫిట్గా లేడని తెలుస్తోంది. పది ఓవర్ల పాటు బౌలింగ్ చేసి, బ్యాటింగ్ చేసేలా సన్నద్ధమైన తర్వాతే హార్దిక్ పరిగణించాలని బీసీసీఐ చూస్తోంది. హార్దిక్ దేశవాళీ క్రికెట్లో తన ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ నేపథ్యంలో హార్దిక్, సూర్యను వన్డే జట్టు నుంచి తప్పించారని తెలుస్తోంది. వాళ్ల స్థానంలో ఇతరులకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.
ఇక టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన రవీంద్ర జడేజాను వన్డేలకు కూడా పక్కనపెట్టింది. స్పిన్ ఆల్రౌండర్లగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ను మరింత రాటుదేల్చాలని యోచిస్తోంది. అయితే బీసీసీఐ పేస్ ఆల్రౌండర్ కోసం ప్రత్యేక దృష్టిసారించింది. హార్దిక్కు ప్రత్యామ్నాయ ఆల్రౌండర్ను అతిత్వరగా సిద్ధం చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డిని బీసీసీఐ ఆల్రౌండర్గా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన నితీశ్ జింబాబ్వే పర్యటనకు తొలుత ఎంపికయ్యాడు. కానీ గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. అతను పూర్తిగా కోలుకున్న తర్వాత టీమిండియాలో వీలైనంత వేగంగా తీసుకురావాలని బీసీసీఐ భావిస్తోంది.