భారత జట్టు ప్రధాన కోచ్ పదవికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ పదవిపై ఆసక్తి కలిగినవారు మే 27, సాయంత్ర 6 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ద్రవిడ్ తర్వాత టీమిండియా కోచ్ బాధ్యతలను ఎవరు చేపడతారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
కోచ్ పదవి రేసులో భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు రవిశాస్త్రికి తిరిగి కోచ్ బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలూ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే విదేశీ క్రికెటర్పై బీసీసీఐ ఆసక్తిగా ఉందని తాజా సమాచారం. ఆ మాజీ ఆటగాడు భారత జట్టు కోచ్ పదవికి దరఖాస్తు చేస్తే అతన్నే ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తుందని తెలుస్తోంది.

టీమిండియాకు కొత్తగా ఎంపికయ్యే ప్రధాన కోచ్ పదవి కాలం మూడున్నరేళ్లు ఉంటుంది. 2027 డిసెంబర్ 31 వరకు కొనసాగుతారు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవి కాలం రానున్న టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుంది. వాస్తవానికి 2023 వన్డే ప్రపంచకప్ అనంతరమే ద్రవిడ్ పదవి కాలం ముగిసింది. కానీ పొట్టి కప్ను దృష్టిలో పెట్టుకుని ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడగించారు.
భారత జట్టును రాహుల్ ద్రవిడ్ గొప్పగా నడిపించాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ సీనియర్లను సమన్వయం చేసుకుంటూ గొప్ప ఫలితాలు రాబట్టాడు. ద్రవిడ్ స్థానంలో వచ్చే కోచ్ కూడా అదే తరహాలో టీమిండియాను నడిపించాలని బీసీసీఐ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కోచ్గా అనుభవం ఉన్నవారికి పెద్దపీట వేయాలని చూస్తోంది. ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కోచ్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ ఫ్లెమింగ్ను టీమిండియా కోచ్గా ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తోంది.
అయితే భారత జట్టు కోచ్ పదవికీ ఫ్లెమింగ్ దరఖాస్తు చేస్తాడా లేదా అనేది అసలు ప్రశ్న. ఒకవేళ ఫ్లెమింగ్ సముఖత చూపించకపోతే ధోనీతో ఓ మాట చెప్పించే యోచనలోనూ బీసీసీఐ ఉందని తెలుస్తోంది. అప్పటికీ ఫ్లెమింగ్ కోచ్ పోస్ట్కు అప్లై చేయకపోతే వీవీఎస్ లక్ష్మణ్ను ఎంపిక చేసే అవకాశం ఉంది.