లోధా కమిటీ సిఫార్సులకు విరుద్ధం..
బీసీసీఐలో కొనసాగుతూ ప్రైవేటు ఫ్రాంఛైజీలు నిర్వహించే ఐపీఎల్కు సేవలందించడం సరికాదని బీసీసీఐ నైతిక విలువల కమిటీ అధికారి డీకే జైన్ స్పష్టం చేశారు. జోడు పదవుల్లో ఏదో ఒక దాన్ని వదులుకోవాలని ఆయన సూచించారు. దేన్ని వదులుకోవాలనేది ఆయా మాజీ క్రికెటర్ల అభిప్రాయాలపై ఆధారపడి ఉందని చెప్పారు. జోడు పదవుల్లో కొనసాగడం బీసీసీఐ నైతిక నియమ, నిబంధనలకు విరుద్ధమని జైన్ తేల్చి చెప్పారు. జస్టిస్ లోధా కమిటీ సిఫారసులకు విరుద్ధమని అన్నారు.
అటో కాలు..ఇటో కాలు..
వీవీఎస్ లక్ష్మణ్, సౌరబ్ గంగూలీ ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో కొనసాగుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మెంటార్గా సేవలందిస్తున్నారు వీవీఎస్. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ కోసం కూడా ఆయన పనిచేస్తున్నారు. సౌరబ్ గంగూలీ గతంలో కోల్కత నైట్ రైడర్స్ మెంటార్గా ఉన్నారు. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆ పదవులతో పాటు వారిద్దరూ బీసీసీఐ సలహా కమిటీలో సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇలా జోడు పదవులను అనుభవించడం ఎథిక్స్ కమిటీ అధికారి జైన్ స్పష్టం చేశారు.
ఒక వ్యక్తికి ఒకే పదవి..
ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నిబంధనను బీసీసీఐలో అమలు చేస్తున్నామని, దీనికి భిన్నంగా వీవీఎస్ లక్ష్మణ్, సౌరబ్ గంగూలీ ప్రవర్తిస్తున్నారని జైన్ తెలిపారు. సచిన్ టెండుల్కర్ తన పదవిలో ఒకదాన్ని వదులుకున్నారని ఆయన గుర్తు చేశారు. సచిన్ టెండుల్కర్ ఇదివరకు బీసీసీఐ సలహా కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. అనంతరం- ముంబై ఇండియన్స్ మెంటార్గా నియమితులైన తరువాత ఆయన సలహా కమిటీ నుంచి తప్పుకొన్నారు. సచిన్లాగే వారిద్దరూ ఏదో ఒక నిర్ణయాన్ని వీలైనంత త్వరగా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.