
ముంబై: ఇటీవలే టీమిండియా మాజీ కెప్టెన్, ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్కు పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసులో క్లీన్చిట్ రాగా.. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కూడా క్లీన్చిట్ లభించింది. గంగూలీకి ఎలాంటి విరుద్ధ ప్రయోజనాలు లేవని బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ స్పష్టం చేశారు. బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టకముందే బంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పుకున్నాడని ఆయన తెలిపారు.
సౌరవ్ గంగూలీకి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశాడు. క్యాబ్ అధ్యక్షుడిగానే కాకుండా బీసీసీఐ ఏజీఎమ్లో బెంగాల్ నుంచి ప్రతినిధిగా కూడా ఉన్నాడని ఫిర్యాదులో ఆరోపించాడు. దీనిపై విచారణ చేపట్టిన డీకే జైన్.. గంగూలీకి ఎలాంటి విరుద్ధ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. 2019 అక్టోబర్ 23న బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టనున్న నేపథ్యంలో క్యాబ్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని క్యాబ్ కార్యదర్శి అభిషేక్ దాల్మియాకు గంగూలీ రాజీనామా లేఖను సమర్పించాడు. దీంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఇందులో లేవని జైన్ పేర్కొన్నారు.
ఇటీవలే రాహుల్ ద్రవిడ్కు భారీ ఊరట లభించింది. ద్రవిడ్పై నమోదైన పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఫిర్యాదును బీసీసీఐ ఎథిక్స్ అధికారి కొట్టేశారు. ద్రవిడ్ ఎలాంటి విరుద్ధ ప్రయోజనాలు పొందలేదని, ఆ ఫిర్యాదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని జైన్ స్పష్టం చేశారు. దీంతో ద్రవిడ్కు లైన్ క్లియర్ అయింది. ద్రవిడ్ ఎన్సీఏ డైరెక్టర్గా, ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంలోని ఇండియా సిమెంట్స్ సంస్థ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడని సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఒకే సమయంలో ఏ వ్యక్తీ ఒకటి కంటే ఎక్కువ హోదాల్లో పని చేయడానికి అనుమతి లేదు. ఈ నిబంధన వల్ల గతంలో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్తో పాటు సచిన్ టెందుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, కపిల్ దేవ్లపై కూడా విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.