హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్పై దాఖలైన పరస్పర విరుద్ధ ప్రయోజనాలు (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) అంశం పిటిషన్ను బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ డీకే జైన్ కొట్టివేశారు. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడిగా ఉన్న సచిన్.. ముంబై ఇండియన్స్ ఐకాన్గా వ్యవహరించడం పరస్పర విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తుందని జస్టిస్ జైన్కు ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
దీంతో బీసీసీఐ ఎథిక్స్ అధికారి సచిన్కు నోటీసు పంపారు. ఈ నోటీసుపై సచిన్ కాస్తంత ఘాటుగానే స్పందించాడు. తనను క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)లో సభ్యుడిగా నియమించిన బోర్డు ఏనాడూ తన బాధ్యతలేమిటో స్పష్టంగా చెప్ప లేదని తన వివరణలో సచిన్ పేర్కొన్నాడు. జస్టిస్ జైన్ నోటీసుపై 13 పాయింట్లతో సచిన్ వివరణ ఇచ్చాడు.
"నన్ను సలహా కమిటీలో నియమించిన బీసీసీఐనే ఇప్పుడు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు విషయంలో వివరణ కోరుతుండటం ఆశ్చర్యంగా ఉంది. సీఏసీలో నా బాధ్యత ఏమిటో స్పష్టంగా చెప్పాలంటూ పదే పదే కోరినా బోర్డు నుంచి స్పందన లభించలేదు. ఆ కమిటీ కేవలం సలహా మాత్రమే ఇవ్వగలదు" అని సచిన్ తెలిపాడు.
"దీంతో సీఏసీలో సభ్యుడిని అయినా... ముంబై ఇండియన్స్ జట్టు ఐకాన్గా కొనసాగితే వచ్చే సమస్య ఏమీ లేదు. పైగా 2013లోనే నేను ముంబై ఇండియన్స్ ఐకాన్గా ఎంపికయ్యాను. ఈ విషయం తెలిసే 2015లో బీసీసీఐ నన్ను సీఏసీలో సభ్యుడిగా ఎందుకు ఎంపిక చేసింది. దీనిపై బీసీసీఐ నుంచే వివరణ కోరండి" అని సచిన్ అన్నాడు.
దీనిపై పూర్తిగా విచారణ జరిపిన బీసీసీఐ ఎథిక్స్ అధికారి జస్టిస్ డీకే జైన్... సచిన్ పదవి విరుద్ధ ప్రయోజన అంశం కిందకు రాదని సోమవారం తీర్పు వెల్లడించారు.