
ముంబై: ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్లో పేరుంది ముంబై ఇండియన్స్కు. ఏ ఫ్రాంఛైజీకి సాధ్యం కాని రీతిలో అయిదుసార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఛాంపియన్గా నిలిచింది. రోహిత్ శర్మ చేతికి పగ్గాలు అందిన తరువాత మరింత రాటుదేలింది. దురదృష్టవశావత్తూ రెండు-మూడు సీజన్లుగా తన స్థాయికి తగ్గట్టుగా ఆటతీరును ప్రదర్శించట్లేదు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తీరు మరీ ఘోరం. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
ఇప్పటికే నాసిరకం ఆటతీరుతో అభిమానుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోందీ జట్టు. ఐపీఎల్ కొనసాగుతోన్న సమయంలో భారీగా ట్రోల్స్కు గురైంది. ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధికంగా ట్రోల్స్ను ఎదుర్కొన్న జట్టుగా నిలిచింది. ఈ పరిస్థితుల మధ్య ఇప్పుడు మరో వివాదాన్ని తలకెత్తుకుంది. తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచీ నోటీసులనూ అందుకుంది. బీసీసీఐ ఎథిక్స్ కమిటీ ఈ మేరకు నీతా అంబానీకి కొన్ని సూచనలతో కూడిన నోటీసును జారీ చేశారు.
ఎథిక్స్ కమిటీ సభ్యుడు వినీత్ శరణ్.. నీతా అంబానీకి నోటీసులను జారీ చేశారు. బీసీసీఐ రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన ఆరోపణలను నీతా అంబానీ ఎదుర్కొంటోన్నారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు సంజీవ్ గుప్తా.. ఆమెపై బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఆరోపణలు చేశారు. ఈ ఫిర్యాదుల్లో వాస్తవం ఉందని భావించిన బీసీసీఐ ఎథిక్స్ కమిటీ సభ్యుడు వినీత్ శరణ్ ఈ మేరకు నోటీసులు పంపించారు. బీసీసీఐ అండర్ రూల్ 39 (బీ) కింద వాటిని నీతా అంబానీకి పంపించారు.
వినీత్ శరణ్.. మాజీ న్యాయమూర్తి. ఇదివరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. పదవీ విరమణ అనంతరం బీసీసీఐ ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా అపాయింట్ అయ్యారు. ఇంతకుముందు ఇదే స్థానంలో పని చేసిన డీకే జైన్ స్థానంలో ఎథిక్స్ కమిటీలోకి వినీత్ శరణ్ను తీసుకుంది బీసీసీఐ. తనపై వచ్చిన ఆరోపణలపై సెప్టెంబర్ 2వ తేదీలోగా రాతపూరక సమాధానాన్ని ఇవ్వాల్సి ఉంటుందని ఈ నోటీసుల్లో స్ఫష్టం చేశారు. ఈ సమాధానం- సంతృప్తికరంగా లేకపోతే ఆమెపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు.