23న అధికారికంగా బాధ్యతలు:
ఈ నెల 23న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహిస్తారు. అదే రోజు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అపెక్స్ కౌన్సిల్లోని 8 స్థానాలకు చివరి రోజు సోమవారం ఎనిమిది మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పోటీ లేకుండా అందరూ ఎన్నిక కావడం ఖాయం అయింది. అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, కార్యదర్శిగా జై షా ఎన్నిక కానున్నారు. 23న అందరూ అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తారు.
బ్రిజేశ్కు ఐపీఎల్ చైర్మన్ పదవి:
గంగూలీ ఏకగ్రీవ ఎన్నికకు ముందు అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ వర్గం నుంచి భారత మాజీ క్రికెటర్, కర్ణాటకకు చెందిన బ్రిజేష్ పటేల్ బోర్డు కొత్త చీఫ్ కానున్నట్టు ఆదివారం రాత్రి వరకూ వార్తలు వచ్చాయి. కానీ.. రాత్రికి రాత్రే జరిగిన పరిణామాలతో గంగూలీ పేరు తెరపైకి వచ్చింది. ఆదివారం జరిగిన అనధికార సమావేశంలో అన్ని రాష్ట్రాల సంఘాల ప్రతినిధులు గంగూలీ వైపే మొగ్గుచూపినట్టు సమాచారం. బ్రిజేశ్కు ఐపీఎల్ చైర్మన్ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అధ్యక్ష పదవిలో పది నెలలు:
కొత్త నిబంధనల ప్రకారం గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవిలో పది నెలల పాటు (సెప్టెంబర్ 2020) కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం కోల్కతా క్రికెట్ బోర్డు (క్యాబ్) అధ్యక్షుడిగా దాదా కొనసాగుతున్నాడు. ఈనెల 23న బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టాక క్యాబ్ పదవిని దాదా వదిలేయనున్నాడు. ఇక కార్యదర్శిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.
2008లో రిటైర్మెంట్:
గంగూలీ కెరీర్లో 113 టెస్ట్లు, 311 వన్డేలు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన గంగూలీ కెరీర్.. 1996లో టెస్ట్ల్లో ఆడడం ప్రారంభించాక కొత్త శిఖరాలకు చేరింది. 2000 నుంచి 2005 వరకు భారత సారథిగా వ్యవహరించిన దాదా.. 2008లో ఆటకు వీడ్కోలు పలికాడు. 2003లో టీమిండియాను ప్రపంచకప్ ఫైనల్లోకి తీసుకెళ్లాడు. రిటైర్మెంట్ అనంతరం కొద్ది సీజన్ల పాటు ఐపీఎల్లో ఆడాడు. ఇక 2015లో తొలిసారి క్యాబ్ చీఫ్గా ఎన్నికైన గంగూలీ ప్రస్తుతం రెండోసారి ఆ పదవిలో ఉన్నాడు.
భవిష్యత్ ప్రణాళికలు:
బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న నేపథ్యంలో గంగూలీ తన భవిష్యత్ ప్రణాళికలను మీడియాతో వెల్లడించాడు. గత మూడేళ్ళుగా ఇబ్బందుల్లో ఉన్న బీసీసీఐను తిరిగి గాడిలో పెడతానని చెప్పాడు. ఫస్ట్క్లాస్ క్రికెటర్ల సంక్షేమమే తొలి ప్రధాన్యం. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన సమస్యగా మారింది. క్రికెట్ కోసం గొప్ప ఆటగాళ్లను ఎలా వినియోగించుకోవాలో సరిగ్గా అర్థం కావడం లేదు. దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలి అని అన్నాడు.