
దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021 ఫైనల్కు దుబాయ్ స్టేడియంలో పూర్తి సామర్థ్యంలో అభిమానులను అనుమతించాలని యూఏఈ ప్రభుత్వాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరింది. భారత్ ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా యూఏఈ, ఒమన్లో బీసీసీఐ ఆధ్వర్యంలోనే జరనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 17న టీ20 ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానుండగా.. ఫైనల్ మ్యాచ్ నవంబరు 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఆక్టోబర్ 15న ముగుస్తుండగా.. రెండు రోజుల్లో పొట్టి టోర్నీ ప్రారంభం కానుంది.
నవంబర్ 14న జరగబోయే టీ20 ప్రపంచకప్ 2021 ఫైనల్కు 25 వేల మందిని అనుమతించాలని బీసీసీఐ భావిస్తోంది. దీనికోసం యూఏఈ అధికారుల అనుమతి తప్పనిసరి. దీంతో బీసీసీఐతో పాటు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) రెండు బోర్డులు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయని, అధికారుల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. తమ వినతిపై యూఏఈ సానుకూలంగా స్పందించే అవకాశముందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
ఇప్పటికే యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 2021కు అభిమానులను అనుమతించిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే ఫ్యాన్స్కు అనుమతిస్తున్నారు. దుబాయ్ స్టేడియానికి వచ్చే అభిమానులు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలన్న నిబంధన ఉంది. షార్జాలో అయితే 16 ఏళ్లు నిండిన వారినే స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. అంతేకాకుండా 48 గంటలలోపు చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ నెగటివ్ రిపోర్ట్ కూడా తప్పనిసరి. అటు అబుదాబిలోనూ ఇదే రూల్ ఉంది. మొత్తానికి ఫాన్స్ ఐపీఎల్ 2021 చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ టీ20 ప్రపంచకప్ 2021 జరగనుంది. క్వాలిఫైర్ మ్యాచుతో టోర్నీ ఆరంభం అవుతుంది. రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమన్, పపువా న్యూ గినియా మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 23న అసలు టోర్నీ అంటే.. సూపర్ 12 స్టేజ్ ప్రారంభమవుతుంది. అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. అదే రోజు దుబాయ్లో సాయంత్రం ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు ఆడనున్నాయి. ఇక గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్లో తొలి మ్యాచ్ జరగనుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత దాయాది జట్లు మరోసారి తలపడనున్నాయి.
టీ20 ప్రపంచకప్ 2021లోని గ్రూప్-1లో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా.. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. క్వాలిఫికేషన్ రౌండ్ గ్రూప్-ఎలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఒమన్, న్యూగినియా జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్-ఎ, గ్రూప్- బి జట్ల మధ్య అక్టోబరు 17 నుంచి 22 వరకూ క్వాలిఫయర్ మ్యాచ్లు జరగనుండగా.. టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-12 ( గ్రూప్-1, గ్రూప్-2) మ్యాచ్లకి అర్హత సాధిస్తాయి. ఇక పాకిస్తాన్, న్యూజీలాండ్ లాంటి పటిష్ట జట్లను ఓడిస్తే.. భారత్ సునాయాసంగా సెమీస్ చేరనుంది.