విదేశీ కోచ్కు చాన్సే లేదు:
టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే, భారత మాజీ సారథి రాహుల్ ద్రవిడ్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ తదితరులు టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే ద్రవిడ్, కుంబ్లేలు టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టడానికి సుముఖంగా లేరని కూడా వార్తలు వస్తున్నాయి. దాంతో ఇక విదేశీ కోచ్ ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా బీసీసీఐ వర్గాలు మాత్రం విదేశీ కోచ్ వచ్చే అవకాశమే లేదని చెప్పడం గమనార్హం. రానున్న హెడ్ కోచ్ కూడా భారత్కు చెందిన వాళ్లే ఉంటారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దాంతో భారత కొత్త కోచ్గా ఎవరు రానున్నారని అందరిలో కుతూహులం నెలకొంది.
నలుగురు విదేశీయులు:
గతంలో నలుగురు విదేశీయులు భారత జట్టు కోచ్గా చేశారు. జాన్ రైట్, గ్రెగ్ చాపెల్, గ్యారీ కిర్స్టెన్, డంకన్ ఫ్లెచర్ కోచ్లుగా ఉన్నారు. ఇందులో కిర్స్టెన్ సక్సెస్ అయ్యాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడి హయాంలోనే భారత్ 2011 వన్డే ప్రపంచకప్ గెలుచుకుంది. మరోవైపు అనిల్ కుంబ్లే కోచ్గా తిరిగి వచ్చే అవకాశం లేదని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. గతంలో 2016-17 సమయంలోనూ కుంబ్లే కోచ్గా చేశాడు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీతో పడక కుంబ్లే తన పదవికి రాజీనామా చేశాడు. ఇప్పుడు కూడా కోహ్లీ కెప్టెన్గా ఉండటంతో కుంబ్లే వచ్చే అవకాశాలు లేవని ముందు నుంచీ వార్తలు వస్తున్నాయి. ఈ పదవి తనకు ఇష్టం లేదని రాహుల్ ద్రవిడ్ చెపుతున్నాడు.
రేసులో లక్ష్మణ్:
అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ తర్వాత అంతటి అనుభవం, సామర్థ్యం ఉన్న భారత మాజీలు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేందర్ సెహ్వాగ్ మాత్రమే. సచిన్ ఈ పదవిని చేపట్టడానికి ఎప్పుడూ ముందుకు రాలేదు. అంతేకాదు ఆ ప్రస్తావన కూడా ఎక్కడా తీసుకురాలేదు. ప్రస్తుతం లక్ష్మణ్ సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు కోచింగ్ బృందంలో ఉన్నాడు. సెహ్వాగ్ కూడా గతంలో ఐపీఎల్ జట్లతో పనిచేశాడు. అయితే సెహ్వాగ్ కంటే లక్ష్మణ్ రేసులో ముందుండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఎవరికి ఓటేస్తాడో మరి.
ఏడు జట్లకు విదేశీ కోచ్లే:
ఐపీఎల్లోని 8 ఫ్రాంచైజీల్లో ఏడు జట్లకు విదేశీ కోచ్లే ఉన్నారు. అయితే నేషనల్ టీమ్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ ఫార్ములా పనిచేయదని బీసీసీఐ బోర్డు వర్గాలు అంటున్నాయి. 'కొత్త హెడ్ కోచ్ భారతీయుడే. ఐపీఎల్తో పోలిస్తే.. భారత జట్టు కోచింగ్ జాబ్ పూర్తిగా భిన్నమైనది. ఏడాది మొత్తం టీమ్తోనే ఉండాలి. ఆ విషయం చూస్తే ఇండియన్ కోచే బెటర్' అని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఐపీఎల్లో విజయవంతమైన కోచ్లుగా పేరున్న రికీ పాంటింగ్ (ఢిల్లీ క్యాపిటల్స్), మహేల జయవర్దెనె (ముంబై ఇండియన్స్) లాంటి వాళ్లు అంత సమయం ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.