
ఆస్ట్రేలియా జట్టుతో పింక్ బాల్ టెస్టు ఆడేందుకు బీసీసీఐ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆసీస్ జట్టు భారత పర్యటనకు వస్తుంది. ఈ పర్యటనలో రెండు జట్లు నాలుగు టెస్టు మ్యాచులు ఆడతాయి. వీటిలో అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్ను డే/నైట్ మ్యాచ్గా నిర్వహించాలని అనుకున్నారు. కానీ బీసీసీఐ మాత్రం దీనికి ససేమిరా అంటోందట. పింక్ బాల్ టెస్టులు సక్సెస్ కాలేదని బీసీసీఐ అధికారులు అంటున్నారు. దీనికి కూడా కారణం ఉంది.
ఇంతకుముందు బంగ్లాదేశ్, ఇంగ్లండ్, శ్రీలంకతో భారత జట్టు పింక్ బాల్ టెస్టులు ఆడింది. అయితే వీటిలో ఒక్క మ్యాచ్ కూడా ఐదు రోజుల పాటు జరగలేదు. బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచులు మూడ్రోజుల్లోనే ముగియగా.. ఇంగ్లండ్తో మ్యాచ్ రెండ్రోజుల్లోనే పూర్తయింది. ప్రేక్షకులు ఐదు రోజులకు టికెట్లు తీసుకుంటారని, అలాంటి మ్యాచులు ఇలా త్వరగా ముగియడం వల్ల ఉపయోగం ఉండదని బీసీసీఐ భావిస్తోంది. అందుకే ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్టు ఆడేందుకు ససేమిరా అంటోంది.
పింక్ బాల్ టెస్టులు ఇప్పటి వరకు 20 జరగ్గా వాటిలో కేవలం ఆరు మ్యాచులు మాత్రమే ఐదో రోజు వరకు వెళ్లాయి. రెండు మ్యాచులు కేవలం రెండ్రోజుల్లోనే ముగిశాయి. ఈ క్రమంలోనే ఐదు రోజుల పాటు జరగాల్సిన మ్యాచులు మధ్యలోనే ముగియడం తమకు నచ్చడం లేదని బీసీసీఐ అంటోంది. అందుకే ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్టు ఆడేందుకు సన్నద్ధంగా లేనట్లు చెప్తోంది. అంతేకాదు, డే/నైట్ టెస్టుల్లో ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తాము ఆడిన మ్యాచులన్నింట్లో కంగారూలు విజయం సాధించారు.
భారత్లో ఆస్ట్రేలియా జట్టు పర్యటించే సిరీస్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (2022-23) సైకిల్లో చివరిది. ఇలాంటి సిరీస్లో పింక్ బాల్ టెస్టు పెట్టడం తమకు ఇష్టం లేదని బీసీసీఐ అంటోంది. ఈ విషయంలో బీసీసీఐ ఎలా అంటే అలాగే చేస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. తాము ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, ఈ నిర్ణయం బీసీసీఐ చేతుల్లోనే ఉందని సీఏ ప్రతినిధి స్పష్టం చేశారు.