ఐపీఎల్కు సమయం దగ్గర పడుతుండడంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుంది. ముందుగా ఈ సారి జరగనున్న అందరి ఐపీఎల్ మెగా వేలంపైనే అందరి చూపు ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఆ దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. వేలం నిర్వహించడానికి ముందే ఈ సారి ఐపీఎల్లో అడుగుపెట్టిన కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్ ముగ్గేరేసి చొప్పున వేలంలో ఉన్న ఆటగాళ్లను ఎంచుకోవడానికి బీసీసీఐ అవకాశం ఇచ్చింది. అయితే దీనికి తాజాగా బీసీసీఐ గడువు విధించినట్లు తెలుస్తోంది. ఈ నెల 31 వరకు ముగ్గురేసి చొప్పున ఆటగాళ్లను ఎంచుకోవాలని అహ్మదాబాద్, లక్నో జట్లకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
లక్నో, అహ్మదాబాద్ జట్లు తమ రిటైన్ ఆటగాళ్ల జాబితా పూర్తి చేస్తే వేలం కోసం ఒక తేదీని ఖరారు చేయొచ్చనే ఆలోచనలో బీసీసీఐ ఉందట. అలాగే వేలం నిర్వహించే వేదికపై కూడా స్పష్టత రానుందని సమాచారం. మిగతా 8 జట్లు ఇప్పటికే తమ రిటెన్షన్ జాబితాను బీసీసీఐకి సమర్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఫిబ్రవరి మొదటి వారంలో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. సంజీవ్ గొయెంకా ఆధ్వర్యంలోని లక్నో ఫ్రాంచైజీ ఇప్పటికే తమ హెడ్ కోచ్గా ఆండీ ఫ్లవర్, మెంటార్గా గౌతమ్ గంభీర్ను నియమించినట్టు ప్రకటించింది. ఇక అహ్మదాబాద్ తమ ఫ్రాంచైజీ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్, కోచ్గా ఆశిష్ నెహ్రా, మెంటార్గా గ్యారీ కిర్స్టెన్ను నియమించుకున్నట్టు సమాచారం.
మరోవైపు దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో ఐపీఎల్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేదికగా భారత్కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితులు అయితేనే లీగ్ను విదేశాలకు తరలించనున్నట్లు తెలిపారు. వీలైనంత వరకు లీగ్ను ఇండియాలోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని ఆయన చెప్పారు. కరోనా కేసులు ఇలాగే పెరిగితే లీగ్ను ఒకటి లేదా రెండు వేదికల్లోనే నిర్వహించనున్నారని సమాచారం. తద్వారా బయోబబుల్ వంటి సమస్యలు ఉండవని అనుకుంటున్నారట. అలాగే మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించడం కూడా కష్టమేనట. ఇప్పటికే కరోనా కారణంగా ఈ నెలలో ప్రారంభమవాల్సిన రంజీ వంటి కీలక టోర్నీలను బీసీసీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.