పాకిస్థాన్కు బీసీసీఐ వరుసగా షాక్లు ఇస్తోంది. పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ దెబ్బకు ఐసీసీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడం దాదాపు ఖరారైన విషయం తెలిసిందే. తమ దేశానికి టీమిండియా రావాలని పాకిస్థాన్ విశ్వప్రయత్నాలు చేసినా బీసీసీఐ దానికి అంగీకరించలేదు. అత్యంత పవర్ఫుల్ బోర్డు అయిన బీసీసీఐ వైపే ఐసీసీ నిలిచింది.
అయితే పుండు మీద కారం చెల్లినట్లుగా పాకిస్థాన్ను భారత్ మరో దెబ్బకొట్టింది. వచ్చే ఏడాది మన దేశంలో జరగనున్న ఆసియా కప్కు పాకిస్థాన్ తప్పక రావాల్సిన పరిస్థితిని భారత్ సృష్టించింది. 2025లో టీ20 ఫార్మాట్లో జరగనున్న ఆసియా కప్కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. 34 ఏళ్ల తర్వాత తొలిసారి ఆసియా మెగాటోర్నీకి ఆతిథ్య బాధ్యతలు అందుకుంది.

అయితే భారత్కు పాకిస్థాన్ తప్పక వచ్చేటట్లుగా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై బీసీసీఐ ఇప్పటి నుంచే ఒత్తిడి మొదలుపెట్టింది. మన బోర్డును ధిక్కరించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్స్ లేకుండా బీసీసీఐ ఉచ్చు బిగిస్తోంది. పాక్ బోర్డు ఆర్థికంగా మరింత నష్టపోకుండా ఉండాలంటే ఐసీసీ, బీసీసీఐ మాటను దాటకుండా ఉండేలా పరిస్థితిని మరింత్ర తీవ్రత చేస్తోంది. గత 16 ఏళ్లుగా పాకిస్థాన్లో టీమిండియా పర్యటించని విషయం తెలిసిందే.
కాగా, 1984లో ఆసియా కప్ టోర్నీ మొదలవ్వగా ఇండియా చివరిగా 1990/91లో ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత మన గడ్డపై ఆసియా మెగాటోర్నీ జరగలేదు. వచ్చే ఏడాది టీ20 ఫార్మాట్లో భారత్, 2027లో బంగ్లాదేశ్ వన్డే ఫార్మాట్లో ఆతిథ్యం ఇవ్వనుంది. మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు టోర్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి.
లాహోర్ వేదికగా భారత్ మ్యాచ్లన్నీ నిర్వహిస్తామని, పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తామని పాక్ బోర్డుతో పాటు మాజీ క్రికెటర్లు బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. కానీ హైబ్రిడ్ మోడల్లోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలని బీసీసీఐ పట్టుబట్టింది. ఐసీసీ కూడా హైబ్రిడ్కే సై అంటుంది.