ముంబై: టీమిండియా పరిమిత ఓవర్ల సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన కెప్టెన్సీపై వస్తున్న ఊహాగానాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జింబాబ్వే పర్యటనకు బయల్దేరే ముందు మంగళవారం ముంబైలో మీడియా సమావేశంలో కెప్టెన్సీ, కొత్త కోచ్, ఫిట్నెస్, సీజన్ లాంటి పలు అంశాలపై మహేందర్ సింగ్ ధోనీ సవివరంగా మాట్లాడాడు.
కెప్టెన్గా తన భవితవ్యం గురించి స్పందిస్తూ.. 'కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోవాల్సింది నేను కాదు.. బీసీసీఐ' అని చెప్పాడు. టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ తక్కువగా ఆడబోతున్న నేపథ్యంలో ఫిట్నెస్ కాపాడుకోవడం తనకు కీలకమని ధోని అన్నాడు.

'ఎంత సమయం ఆడతామన్నది ముఖ్యం కాదు. కొన్ని రోజులే జాతీయ జట్టుకు ఆడినా చాలు. ఉత్సాహం దానంతట అదే వచ్చేస్తుంది. ఐతే ఫిట్నెస్ కాపాడుకోవడం కీలకం' అన్నాడు. జింబాబ్వే పర్యటనలో పూర్తిగా కుర్రాళ్లతో కూడిన యువ జట్టును నడిపించడం తనకు భిన్నమైన అనుభవమని ధోనీ అభిప్రాయపడ్డాడు.
'చాన్నాళ్లుగా అలవాటైన ఆటగాళ్లతోనే ఆడుతున్నా. వాళ్లందరికీ తమ బాధ్యతలేంటో అవగాహన ఉంది. అయితే జింబాబ్వేతో జరగబోయే సిరీస్లో ఆడబోయే ఆటగాళ్లలో చాలామంది నాకు కొత్త. కాబట్టి చాలా త్వరగా వారిపై నేనో అవగాహనకు రావాలి. ఎవరిని ఆడించాలి. ఎవరినెలా ఉపయోగించుకోవాలో చూసుకోవాలి. ఐతే ఇది మెరుగైన, సమతూకం ఉన్న జట్టు' అన్నాడు.
టీమిండియా కోచ్ అంశంపై మాట్లాడుతూ.. 'అత్యుత్తమ వ్యక్తినే కోచ్గా ఎంచుకోవాలి. ఇంగ్లిష్ మాట్లాడతాడా.. హిందీ మాట్లాడతాడా.. అని కాకుండా మన సంస్కృతిని ఎంత బాగా అర్థం చేసుకుంటాడో చూడాలి. గతంలో భారత జట్టుకు అత్యుత్తమ కోచ్లని అనిపించుకున్న వాళ్లంతా ఇదే చేశారు'అని ధోనీ పేర్కొన్నాడు.
టీమిండియా కోచ్ పదవికి అర్హతల గురించి పేర్కొంటూ హిందీ వచ్చిన వారికి ప్రాధాన్యమని పేర్కొనడంపై ధోనీ పైవిధంగా స్పందించాడు. 'ఇంగ్లిష్ ప్రస్తుతం మన ఆటగాళ్లకు పెద్ద అడ్డంకేమీ కాదు. కోచ్తో సంభాషణ సమస్యేమీ కాదు. హిందీలో మాట్లాడితే మంచిదే. కానీ అదొక్కటే అర్హత కాదు. మేం ప్రస్తుతం చాలా దేశాల్లో క్రికెట్ ఆడుతున్నాం. అత్యుత్తమ వ్యక్తినే కోచ్గా ఎంచుకోవాలి' అని పేర్కొన్నాడు.