
హైదరాబాద్: ఉపఖండం అంటేనే స్పిన్ పిచ్లకు పెట్టింది పేరు. ఇందుకు భారత్ ఏమీ ప్రత్యేకం కాదు. భారత పర్యటనకు వచ్చే పర్యాటక జట్లకు స్పిన్ పిచ్లే ఎక్కువగా స్వాగతం పలుకుతాయి. అదే టీమిండియా విదేశీ పర్యటనకు వెళితే మాత్రం ఇందుకు భిన్నం. విదేశాల్లో ఎక్కువగా పేస్ పిచ్లే ఉంటాయి కాబట్టి టీమిండియా విజయాలను నమోదు చేయలేదు.
ఇందుకు ఉదాహారణ... ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనలో, ఇటీవలి ఇంగ్లాండ్ సిరీస్లో భారత జట్టు సిరీస్లు ఓడిపోవడం. ఈ రెండు పర్యటనల్లో కూడా టీమిండియా ఓటమిపాలైంది. అయితే, వెస్టిండీస్తో గురువారం ఆరంభం కానున్న రెండు టెస్టుల సిరీస్లో మాత్రం పిచ్లు పేసర్లకే అనుకూలించే అవకాశాలున్నాయట.
వెస్టిండిస్తో స్వదేశంలో సిరిస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఆసీస్ పర్యటనలో భాగంగా బ్రిస్బేన్లో జరిగే తొలి టి20లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో బౌన్సీ పిచ్లపై టీమిండియా సన్నాహకాలకు సమయం చాలా తక్కువ.
దీంతో వెస్టిండిస్ సిరీస్నే దీనికి వాడుకోవాలని భారత జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లుగా తెలిసింది. ఆసీస్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని పేస్ పిచ్లు సిద్ధం చేయమని క్యురేటర్లకు భారత జట్టు యాజమాన్యం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా భారత్-వెస్టిండీస్ తొలి టెస్టుకు ఆతిథ్యమివ్వబోతున్న రాజ్కోట్ మైదానంలో పిచ్ పరిస్థితిని సమీక్షించడానికి బీసీసీఐ ప్రత్యేకంగా క్యురేటర్ల బృందాన్ని పంపింది.
అయితే, బీసీసీఐ ఇలా ప్రత్యేకంగా క్యురేటర్ల బృందాన్ని పంపడంపై సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్సీఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. మ్యాచ్కు పిచ్ సిద్ధం చేయడం స్థానిక క్యురేటర్ బాధ్యత అని, ఈ విషయంలో బీసీసీఐ క్యూరేటర్లు జోక్యం చేసుకోవడం మంచిది కాదని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్సీఏ) నిరంజన్ షా తప్పు పట్టారు.
"మాది చాలా పాత అసోసియేషన్. ఎన్నో ఏళ్లుగా చాలా మ్యాచ్లు నిర్వహిస్తున్నాం. బీసీసీఐ తమ క్యుటరేర్లను పంపడం సరైన నిర్ణయం కాదు. రేపు మ్యాచ్ అయ్యాక పిచ్ విషయంలో ఐసీసీ ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే మేం నిందను మోయాల్సి ఉంటుంది. పిచ్ తయారీలో మా క్యురేటర్ల ప్రమేయం లేకపోతే జరిగే పరిణామాలకు బీసీసీఐయే బాధ్యత తీసుకోవాలి" అని అన్నారు.
"పిచ్ల విషయంలో బోర్డుకు ఆందోళన ఉంటే ప్రతి స్టేడియంలో వాళ్ల క్యురేటర్లనే నియమించుకోవాలి. రంజీ మ్యాచ్లకూ కూడా వాళ్లే ఉండాలి. అలా కానపుడు స్థానిక క్యురేటర్లు ఎందుకు? బయటి వాళ్ల కంటే స్థానికులకే ఇక్కడి పిచ్లపై అవగాహన ఉంటుందిఠ అని ఎస్సీఏ సీనియర్ సభ్యుడు నిరంజన్ షా మండిపడ్డారు.
దీనిపై బీసీసీఐ మాత్రం తనదైన శైలిలో స్పందించింది. బీసీసీఐ చీఫ్ క్యురేటర్ దేశంలో ఏ మైదానానికైనా వెళ్లొచ్చని, పిచ్ల తయారీని సమీక్షించవచ్చని.. రంజీ ట్రోఫీ సందర్భంగా కూడా ఇలా జరుగుతుంటుందని.. తాజా నిర్ణయం పట్ల అంత ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని బోర్డు ఉన్నతాధికారి ఒకరు అన్నారు.