
హైదరాబాద్: క్రికెటర్లకు పెండింగ్లో ఉన్న బకాయిలను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. జనవరి వరకు ఆటగాళ్లకు, కోచ్లకు ఉన్న బకాయిలను బోర్డు చెల్లించింది. ఈ చెల్లింపుల్లో ఇండియా-ఏ, అండర్-19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్కు గతేడాది జులై నుంచి డిసెంబర్ వరకు జీతం కింద బోర్డు రూ.2.43 కోట్లను చెల్లించింది.
ఇక, టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు మ్యాచ్ ఫీజులు, టూర్ ఫీజులతో పాటు రిటెయిన్ ఫీజులతో కలిపి గత ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం రూ. 1.27 కోట్లు అందుకున్నాడు. గతేడాది వెస్టిండిస్ పర్యటన నుంచి సఫారీ పర్యటనకు ముందు జరిగిన శ్రీలంక పర్యటన వరకు పాండ్యాకు బీసీసీఐ ఈ చెల్లింపులు చేసింది.
అదే విధంగా విదేశీ పర్యటనలకు గాను చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు సుమారు రూ. కోటి దక్కింది. అలాగే రహానే, అభినవ్ ముకుంద్లకు రూ. 1.47 కోట్లు, రూ. 33 లక్షలు ముట్టాయి. లంక పర్యటనకు సంబంధించి టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు రూ.57 లక్షలు చెల్లించారు.
టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రాకు వన్టైమ్ బెనిఫిట్ కింద రూ. 60 లక్షలను బీసీసీఐ అందించింది. మాజీ క్రికెటర్లకు బోర్డు ఎప్పటినుంచో ఈ విధంగా నజరానా ఇస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది చివర్లో నెహ్రా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
శ్రీలంకతో సిరిస్కు కామెంటేటర్గా వ్యవహరించిన మురళీ కార్తీక్కు రూ.30 లక్షలు, సంజయ్ మంజ్రేకర్కు రూ.36 లక్షలు లభించాయి. ప్రొఫెషనల్ ఛార్జీల కింద మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్కు బోర్డు రూ. 75 లక్షలు చెల్లించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.