
హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్లకు ఎట్టకేలకు ఆమోద ముద్ర పడింది. శుక్రవారం జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో (ఎస్జీఎమ్) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ ఏడాది మార్చిలోనే ఆటగాళ్ల కాంట్రాక్ట్లను క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ భారీగా పెంచినప్పటికీ, బోర్డు ఆమోదం తెలపలేదు.
దీంతో బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదురి సంతకం పెట్టలేదు. క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్లపై నిర్ణయం తీసుకునేందుకు అత్యవసరంగా సమావేశమైన బోర్డు జనరల్ బాడీ ఈ అంశంపై ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో ఇంగ్లాండ్ పర్యటనకు ముందే ఆటగాళ్లకు చెల్లింపులు చేస్తామని అమితాబ్ చౌదురి తెలిపాడు.
కొత్త క్రాంట్రాక్ట్ ప్రకారం ఏ+ కేటగిరిగి దక్కించుకున్న ఆటగాళ్లకు రూ. 7 కోట్లు, ఏ కేటగిరిగిలో ఉన్న ఆటగాళ్లకు రూ. 5 కోట్లు... బీ కేటగిరిగిలో ఉన్న ఆటగాళ్లకు రూ. 3 కోట్లు... సీ కేటగిరిగిలో ఉన్న ఆటగాళ్లకు రూ. 1 కోటి బోర్డు చెల్లించనుంది.
మరోవైపు దేశవాళీ, మహిళా క్రికెటర్లకు జీతాల పెంపుపై కూడా బోర్డు సానుకూలంగా స్పందించింది. మొత్తంగా ఎజెండాలో ఉన్న 10 అంశాలపై బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బీసీసీఐ అసోసియేట్ సభ్యత్వం లేకపోవడంతో ఈ సమావేశానికి పుదుచ్చెరి ప్రతినిధులను అనుమతించలేదు.
ఇక, బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్ చీఫ్గా అజిత్ సింగ్ నియామాకానికి ఆమోదం తెలిపిన బోర్డు అతను బాధ్యతలు స్వీకరించే వరకు నీరజ్ కుమార్ను కొనసాగుతారని స్పష్టం చేసింది. అయితే దీనిపై సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 1ననే అజిత్ సింగ్ బాధ్యతలు స్వీకరించాడని, ఐపీఎల్ మొత్తం తన పనిని నిర్వహించాడని స్పష్టం చేశాడు. ఈ పరిస్థితుల్లో అతడి నియామకాన్ని ఎలా పక్కనబెడతారని ప్రశ్నించారు. దీంతో సీఓఏ, బీసీసీఐ అధికారుల మధ్య మరోసారి విభేదాలు చోటు చేసుకున్నాయి.