
బెట్టింగ్ ఆరోపణలతో సతమవుతున్న అహ్మదాబాద్ జట్టును సొంతం చేసుకున్న సీవీసీ క్యాటిటల్స్కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని సమాచారం. త్రిసభ్య కమిటీతో బీసీసీఐ జరిపిన విచారణలో సీవీసీ క్యాపిటల్స్ సంస్థకు క్లీన్ వచ్చినట్టు తెలుస్తోంది. ఐపీఎల్లో రెండు కొత్త జట్ల కోసం దుబాయ్ వేదికగా ఈ ఏడాది నిర్వహించిన వేలంలో అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆ సంస్థ బీసీసీఐకి 5,625 కోట్ల రూపాయలను చెల్లించనుంది. అలాగే లక్నో జట్టును ఆర్పీఎస్జీ గ్రూప్ 7,090 కోట్ల రూపాయలకు దక్కించుకుంది.
అయితే ఆ తర్వాత అహ్మదాబాద్ను కోనుగోలు చేసిన సీవీసీ గ్రూప్పై బెట్టింగ్ ఆరోపణలు వచ్చాయి. సిసల్, టిప్కో అనే బెట్టింగ్ సంస్థలతో సీవీసీకి సంబంధాలున్నాయనేది అరోపణ. ఇవి నిజానికి స్పోర్ట్స్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ సంస్థలు. దీంతో బీసీసీఐ విచారణకు ఆదేశించింది. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ విచారణలో సీవీసీ సంస్థ ఇచ్చిన వివరాల పట్ల త్రిసభ్య కమిటీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
త్రిసభ్య విచారణలో తమకు వచ్చిన నిధులను సీవీసీ రెండు రకాలుగా పేర్కొంది. ఒక రకమైన నిధులు ఆసియా నుంచి వచ్చే ఫండ్స్ కాగా, మరో రకమైన నిధులు యూరోపియన్ నుంచే ఫండ్స్గా పేర్కొంది. నిజానికి యూరోపియన్ దేశాల్లో సీవీసీ సంస్థకు ఫుట్బాల్, రగ్బీ, రేసింగ్ వంటి స్పోర్ట్స్లో కూడా పెట్టుబడులు ఉన్నాయి. సిసల్, టిప్కో సంస్థలు యూరోపియన్ ఫండ్స్తో నడుస్తున్నాయని, వాటికి ఆసియా ఫండ్స్తో సంబంధం లేదని బీసీసీఐ త్రిసభ్య కమిటీకి సీవీసీ సంస్థ వివరించింది.
దీంతో సీవీసీ వివరణకు బీసీసీఐ సంతృప్తి చెంది క్లీన్ చీట్ కూడా ఇచ్చింది. దీంతో త్వరలోనే సీవీసీకి 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' కూడా ఇవ్వనున్నట్టు సమాచారం.ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. దీంతో త్వరలోనే ఆ జట్టు ముందస్తుగా నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోనుంది. అంతేకాకుండా మిగతా ఫార్మాలటీస్ కూడా త్వరలోనే పూర్తి చేయనున్నట్లు తెలిసింది. దీంతో త్వరలోనే ఐపీఎల్ మెగా వేలానికి ఏర్పాట్లు చేయనున్నారు.
ఫిబ్రవరిలో మెగా వేలం
కాగా ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 13, 14న జరగనుంది. బెంగళూరు వేదికగా ఈ వేలం జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ నుంచి అన్ని ప్రాంచైజీలకు వివరాలు అందినట్టు సమాచారం. మెగా వేలానికి సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.