హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్గా ఉన్న అనిల్ కుంబ్లే పదవీ కాలం ముగుస్తుంది. కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మే 31 (బుధవారం)తో దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తయింది. ఇక ఇంటర్వ్యూలు మాత్రమే జరగాల్సి ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు| స్కోరు కార్డు
టీమిండియా కొత్త కోచ్ పదవి కోసం మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, సన్రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ, లాల్చంద్ రాజ్పుట్, టీమిండియా మాజీ ఆటగాడు దొడ్డ గణేశ్, ఇంగ్లాండ్ క్రికెటర్ రిచర్డ్ పైబస్తో పాటు ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే ఇలా మొత్తం ఆరుగురు దరఖాస్తు చేసుకున్నారు.

అయితే ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ను ఇదే విషయంపై ప్రశ్నించగా, ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. కెప్టెన్ కోహ్లీతో కలిసి తాను అద్భుతాలు చేస్తానని చెప్పిన షేన్ వార్న్, బీసీసీఐ మాత్రం తనను కోచ్గా భరించలేదని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు.
'నేను చాలా ఖరీదైన వాడిని. బీసీసీఐ నన్ను భరించగలదని నేను అనుకోవడం లేదు. కోహ్లీకి, నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరం కలిసి అద్భుతమైన ఫలితాలు సాధించగలం. కానీ ముందే చెప్పినట్లు నన్ను తీసుకోవాలంటే చాలా చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే' అని వార్న్ అన్నాడు.
2007లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన షేన్ వార్న్ గతంలో ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఉన్నాడు. ఆ తర్వాత అదే జట్టుకు నాలుగేళ్ల పాటు మెంటార్గా కూడా వ్యవహరించాడు. ప్రస్తుతం వివిధ చానల్స్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.