రేపటి లోపు టీమిండియా కొత్త కోచ్ ఎవరనే విషయం తేలిపోనుంది. గత కొన్ని రోజులుగా భారత జట్టు కొత్త కోచ్ ఎవరనే ఆసక్తి అందరిలో కొనసాగింది. కానీ ఈ పదవి కోసం మంగళవారం ఇద్దరికి మాత్రమే బీసీసీఐ ఇంటర్వ్యూ నిర్వహించడంతో ఉత్కంఠకు తెరపడింది. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా హెడ్ కోచ్ స్థానాన్ని గౌతమ్ గంభీర్ చేపట్టడం దాదాపు ఖాయమైంది.
అయితే కోచ్ రేసులో గంభీర్తో పాటు డబ్ల్యూవీ రామన్ కూడా నిలిచాడు. గంభీర్, రామన్ను బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) మంగళవారం తొలి రౌండ్ ఇంటర్వ్యూ చేసింది. అడ్వైజరీ కమిటీలో చైర్మన్గా అశోక్ మల్హోత్రా, సభ్యులుగా జతిన్ పరాంజపె, సులక్షణ నాయక్లు ఉన్నారు. కాగా, వీరిద్దరికి సీఏసీ సులువుగా అనిపించే అత్యంత క్లిష్టమైన మూడు ప్రశ్నలను సంధించింది.

తొలి ప్రశ్న: టీమిండియా కోచింగ్ సిబ్బందికి సంబంధించి మీ ఆలోచనలు ఏంటి?
రాహుల్ ద్రవిడ్ స్థానంలో బాధ్యతలు అందుకునే టీమిండియా హెడ్ కోచ్ పోస్ట్ ఎంతో ఒత్తిడితో ఉంటుంది. జట్టు ఎంపిక, పరాజయాల అనంతరం ఎదురయ్యే విమర్శలను కోచ్గా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అభదత్రా భావం, బయట నుంచి వచ్చే ఒత్తిళ్లతో ఆటగాళ్లు ఏకాగ్రత కోల్పోకుండా జట్టును కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ కష్టతరమైన సవాళ్ల గురించి గంభీర్, రామన్ అభిప్రాయాలను అడ్వైజర్ కమిటీ తెలుసుకుంది.
రెండో ప్రశ్న: బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో వయసు మీద పడిన ఆటగాళ్లతో భారత జట్టులో పరివర్తన దశను ఎలా ముందుకు తీసుకెళ్తారు?
37 ఏళ్ల రోహిత్ శర్మ, 35 ఏళ్ల విరాట్ కోహ్లి కెరీర్ గురించి సీఏసీ పరోక్షంగా ప్రశ్నించింది. మరి కొన్నాళ్లలో ఈ స్టార్లు ఇద్దరూ రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. అయితే బ్యాటింగ్లో టీమిండియా ఇప్పటికీ ఈ సీనియర్లపైనే ఆధారపడింది. కొన్ని మ్యాచ్ల్లో యువ ప్లేయర్లు మెరిపించినా, నిలకడలేమితో తిరిగి పరిస్థితి మొదటికొస్తుంది. రోహిత్-కోహ్లిని మరికొన్నాళ్లు జట్టులో కొనసాగిస్తే యువ ఆటగాళ్లకు ఎక్కవ అవకాశాలు దక్కవు. భవిష్యత్పై ప్రభావం చూపుతుంది. అలా అని.. రోహిత్, కోహ్లి వారసులను నిర్ణయించకుండానే వారిద్దరిని తప్పిస్తే అది మరింత ప్రమాదం. ఈ సవాలైన ప్రశ్నను అడ్వైజరీ కమిటీ సంధించింది.
3. మూడు ఫార్మాట్లకు భిన్నమైన కెప్టెన్లు, పనిభారం దృష్ట్యా ఫిట్నెస్ ప్రమాణాలు, ఐసీసీ ఈవెంట్లలో భారత్ ట్రోఫీని గెలవలేకపోవడం.. వంటి విషయాలపై మీ అభిప్రాయాలు ఏంటి?
ఇక భారత క్రికెట్లో అత్యంత వివాదస్పదంగా మారిన స్ప్లిట్ కెప్టెన్సీ గురించి సీఏసీ ప్రశ్నలు అడిగింది. మూడు ఫార్మాట్లకు భిన్నమైన కెప్టెన్ల కాన్సెప్ట్తోనే సారథి బాధ్యతలు కోహ్లి నుంచి రోహిత్ చేతుల్లోకి వెళ్లాయి. ఈ నిర్ణయం జట్టుపై ప్రభావం చూపించింది. ఇక తరుచూ ఆటగాళ్ల గాయాలు, సోషల్ మీడియాలో రోహిత్ ఫిట్నెస్పై వస్తున్న విమర్శల గురించి అభిప్రాయాలను కమిటీ తెలుసుకుంది. అలాగే సెమీఫైనల్, ఫైనల్లో భారత్ ఓటముల గురించి గంభీర్, రామన్లను అడ్వైజరీ కమిటీ విశ్లేషించమని కోరింది.