
దుబాయ్: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో వాయిదా పడ్డ టీ20 ప్రపంచకప్ను తిరిగి ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయించేందుకు శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనుంది. ఈ చర్చలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా పాల్గొననున్నారు. 2021, 2022 టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను పరస్పరం మార్చుకునే విషయంపై బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆస్ట్రేలియాలో, వచ్చే ఏడాది భారత్లో టీ20 ప్రపంచకప్ను నిర్వహించాలి. అయితే కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది జరగాల్సిన మెగా టోర్నీ 2022కు వాయిదా పడింది. ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టిన సీఏ వచ్చే ఏడాదే ఆ టోర్నీని నిర్వహించాలని భావిస్తోంది. 2023లో వన్డే ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వనున్న బీసీసీఐ.. 2022లో పొట్టి కప్పు నిర్వహణకు సిద్ధంగా లేదు. మరి రెండు బోర్డులు ఏ నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.
తమ దేశంలో జరగాల్సిన 2020 టోర్నీ ఏడాది పాటు వాయిదా పడింది కాబట్టి వచ్చే ఏడాది అవకాశం తమకే ఇవ్వాలని సీఏ.. పాత షెడ్యూల్ ప్రకారం 2021 టీ20 ప్రపంచకప్ అవకాశం తమకే ఇచ్చి 2022 కోసం ఆసీస్ ఆతిథ్యం ఇవ్వాలని బీసీసీఐ వాదిస్తోంది. 2023లో భారత్లో వన్డే ప్రపంచకప్ కూడా జరగాల్సి ఉన్నందున సంవత్సరం వ్యవధిలో రెండు మెగా ఈవెంట్ల నిర్వహణ సమస్యలతో బీసీసీఐ తమ వాదనను ఐసీసీ ముందు ఉంచుతోంది. వరుసగా రెండేళ్లు రెండు పెద్ద టోర్నీల ఆతిథ్యం ఏమాత్రం బాగుండవని, ప్రేక్షకుల ఆసక్తే తగ్గడమే కాదు.. బోర్డు నిర్వహణా శక్తికి కత్తిమీద సాములాంటిదేనని బీసీసీఐ అంటోంది.
దీంతో పాటు వచ్చే ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరుగాల్సి ఉన్న మహిళల వన్డే ప్రపంచకప్పై కూడా ఈ రోజు జరగనున్న ఐసీసీ సమావేశంలో చర్చ సాగనుంది. ఇక ఐసీసీ చైర్మన్ ఎన్నిక నామినేషన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రేసులో చాలామంది ఉన్నారు. బీసీసీఐ బాస్ గంగూలీ కూడా రేసులో ఉన్నట్లు సమాచారం.