భారత ఆటగాళ్లకు సంబంధించిన 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదేశాలను పెడచెవిన పెట్టి దేశవాళీ టోర్నీలో పాల్గొనని ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లపై బీసీసీఐ కొరడా ఝుళిపించింది. సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్లో ఈ యువ ప్లేయర్ల పేర్లను తొలగించింది.
అయితే ఇషాన్ కిషన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మానసిక అలసట కారణంగా జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్తో ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ సంప్రదించిందని తెలుస్తోంది. గతేడాది నవంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో భారత్ తరఫున ఇషాన్ ఆఖరిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ అర్ధంతంగా పర్యటన నుంచి తప్పుకున్నాడు. మానసిక అలసట కారణంగా స్వదేశానికి తిరిగొచ్చాడు.

మరోవైపు ఇషాన్ కిషన్ తిరిగి రీఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ క్రికెట్ లేదా పోటీ క్రికెట్ ఆడాలని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించాడు. కానీ ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో ఇషాన్ ఆడటానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, కానీ ఆ ఆఫర్ను యువ వికెట్ కీపర్ తిరస్కరించాడని సమాచారం. ''ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ జరుగుతున్న సమయంలో టీమిండియా మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్ను సంప్రదించింది. కానీ తాను సిద్ధంగా లేనని, ఇషాన్ దాన్ని తిరస్కరించాడు'' అని ప్రముఖ క్రీడా వెబ్సైట్ పేర్కొంది.
ఆ తర్వాత ఇషాన్ కిషన్ తీసుకున్న నిర్ణయాలు బోర్డును ధిక్కరించినట్లుగా బీసీసీఐ భావించినట్లు తెలుస్తోంది. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ), జార్ఖండ్ క్రికెట్ బోర్డుతో సంప్రదింపులు లేకుండా ఇషాన్ స్వతహాగా ప్రాక్టీస్ చేసుకోవడం బీసీసీఐకి ఆగ్రహాన్ని తెప్పించింది. ఆటకు సిద్ధంగా లేనని పేర్కొన్న ఇషాన్.. తర్వాత పాండ్య బ్రదర్స్తో కలిసి వడోదరలో ప్రాక్టీస్ చేసిన విషయం తెలిసిందే.
కాగా, క్రికెట్ నుంచి విరామం తీసుకున్న ఇషాన్ కిషన్ ఎట్టకేలకు తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. నవీ ముంబై వేదికగా జరుగుతున్న డీవై పటేల్ టీ20 కప్లో ఆర్బీఐ జట్టు తరఫున పోటీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ పునరాగమన మ్యాచ్లో ఇషాన్ కిషన్ నిరాశపరిచాడు. 12 బంతులు ఎదుర్కొన్న అతను 19 పరుగులు చేశాడు. రెండు బౌండరీలు, ఒక సిక్సర్ బాదాడు.