రంజీ ట్రోఫీలో పాల్గొనడానికి ఆసక్తి చూపని భారత ఆటగాళ్లను తిరిగి దారిలో పెట్టడానికి బీసీసీఐ కఠిన చర్యలు చేపడుతోంది. దేశవాళీ టోర్నీలో తప్పక ఆడాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బీసీసీఐ మరో కొత్త నిబంధనలను సిద్ధం చేస్తోంది. ఐపీఎల్ ఆడాలంటే కనీసం 3-4 రంజీ మ్యాచ్లు ఆడేలా నిబంధనలు తీసుకురావడానికి బీసీసీఐ ప్రయత్నిస్తున్నట్లు సమచారం.
''కొంత మంది ఆటగాళ్లు రెడ్ బాల్ క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపట్లేదు. భారత జట్టుకు దూరంగా ఉంటే ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో కొన్ని మ్యాచ్లు ఆడుతున్నారు. కానీ రంజీ ట్రోఫీ సమయంలో రాష్ట్ర జట్టుకు అందుబాటులో ఉండట్లేదు. ఇలాంటి ఆటగాళ్లను కట్టడిచేయడానికి రంజీ ట్రోఫీలో మూడు నుంచి నాలుగు మ్యాచ్లు ఆడటం తప్పనిసరిగా బీసీసీఐ చేస్తోంది. అలా రంజీ మ్యాచ్లు ఆడలేకపోతే వాళ్లు ఐపీఎల్ ఆడలేరు. ఆ ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు విడుదల చేసినా ఐపీఎల్ వేలానికి కూడా వాళ్లు అనర్హులే''

''బీసీసీఐ నుంచి ఆదేశాలు రాకపోతే కొంతమంది యువ స్టార్ ప్లేయర్లు రంజీ ట్రోఫీని నిర్లక్ష్యంగా చూస్తారని రాష్ట్ర బోర్డులు భావిస్తున్నాయి. హార్దిక్ పాండ్య విషయం భిన్నమైనది. ప్రస్తుతం అతడు రెడ్ బాల్ క్రికెట్ను సమర్థవంతంగా ఆడలేని స్థితిలో ఉన్నాడు. పనిభారాన్ని అతడిపై అంచనా వేస్తూ ఐసీసీ ఈవెంట్స్ కోసం అతడిని సిద్ధం చేస్తున్నారు. కానీ ఇతర ప్లేయర్లకు ఇలాంటి మినహాయింపు లేదు. అయితే వాళ్లకు కాల్ చేస్తే ఫిజియో వర్క్ అని కబుర్లు చెబుతున్నారు. కానీ ఇప్పటినుంచి ఆ ఛాన్స్ ఉండదు'' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
అయితే ఇషాన్ కిషన్ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ ఈ కొత్త నిబంధనలు తీసుకువస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మానసిక అలసట కారణంతో టీమిండియాకు దూరమైన అతడు వడోదరలో పాండ్య బ్రదర్స్తో కలిసి శిక్షణ పొందుతున్నాడు. భారత జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాళీ టోర్నీలు ఆడాలని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించినప్పటికీ ఇషాన్ వినిపించుకోలేదు.
ఈ విషయంలో ఇషాన్ కిషన్ వైఖరిపై బీసీసీఐ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు అతడితో సెంట్రల్ కాంట్రాక్ట్ను ఉపసంహరించుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే సెంట్రల్ కాంట్రాక్ట్ గురించి బీసీసీఐ ఎలాంటి చర్చ జరపలేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో 'గ్రేడ్-సీ'లో ఉన్నాడు. ఏడాదికి రూ.కోటి వేతనం అందుకుంటున్నాడు.