నెలరోజులపైగా సాగిన అసలు సిసలు క్రికెట్ పండుగ వన్డే వరల్డ్ కప్ ముగిసింది. ఫైనల్ వరకు దూసుకొచ్చిన టీమిండియా.. చివరి మ్యాచులో తడబడి కప్పు చేజార్చుకుంది. అయితే తొలిసారి ఈ మెగా టోర్నీ సంపూర్ణ ఆతిథ్య బాధ్యతలు తీసుకున్న బీసీసీఐ మాత్రం దీన్ని బడా సక్సెస్ చేసిందనే చెప్పాలి. ఈ మెగాటోర్నీ తొలి మ్యాచ్ జరిగినప్పుడు చాలా మంది బీసీసీఐని విమర్శించారు.
న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ టాస్ సమయంలో స్టేడియంలో ఎక్కువ మంది ప్రేక్షకులు కనిపించలేదు. మ్యాచ్ మొదలైన తర్వాత కూడా మధ్యాహ్నం ఎండకు ఇబ్బంది పడిన ఫ్యాన్స్.. స్టేడియానికి రాలేదు. దీంతో స్టేడియం బోసిగా కనిపించింది. దీన్ని అదునుగా తీసుకున్న పాకిస్తాన్ ఫ్యాన్స్.. భారత్పై, బీసీసీఐపై జోకులు వేశారు.

అయితే అదే మ్యాచ్ సాయంత్రానికి స్టేడియం దాదాపు నిండిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఎవరికీ ప్రేక్షకులు లేరనే అవకాశం కూడా రాలేదు. ఈ క్రమంలోనే మొత్తం ఈ మెగాటోర్నీకి 12.5 లక్షల మంది హాజరైనట్లు ఐసీసీ వెల్లడించింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ చూసేందుకు కూడా సుమారు లక్ష మంది ప్రేక్షకులు రావడం గమనార్హం.
ఇప్పటి వరకు వన్డే వరల్డ్ కప్ ఒక ఎడిషన్ను ఇంత మంది ఎప్పుడూ చూడలేదు. ఒక్క వరల్డ్ కప్ అనే కాదు. ఏ ఐసీసీ టోర్నీకి కూడా ఇంత మంది ప్రేక్షకులు హాజరు కాలేదు. గతంలో ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ వేదికగా జరిగిన 2015 వరల్డ్ కప్ చూసేందుకు ఓవరాల్గా 10 లక్షల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఆ తర్వాత ఇంగ్లండ్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ చూసేందుకు కేవలం 7.5 లక్షల మంది ప్రేక్షకులు మాత్రమే వచ్చారు.
ఈసారి మాత్రం ఆ రికార్డులన్నీ బద్దలు కొట్టిన ప్రేక్షకులు.. 12 లక్షల మందికిపైగా ఈ మెగాటోర్నీకి హాజరై చరిత్ర సృష్టించారు. దీనిపై ఐసీసీ పెద్దలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ టోర్నీ మెగా సక్సెస్ అయిందంటూ కితాబిచ్చారు. ఈ టోర్నీని సక్సెస్ చేసేందుకు బీసీసీఐ ఎన్నో సరికొత్త ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.