
హైదరాబాద్: డోపింగ్ పరీక్షల్లో విఫలమైన పంజాబ్ వికెట్ కీపర్ అభిషేక్ గుప్తాపై బీసీసీఐ 8 నెలల సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం అధికారిక ప్రకటన చేసింది. 27 ఏళ్ల అభిషేక్ గుప్తా నిషేధిత ఉత్ప్రేరకం టెర్బుటలైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో అతడిపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఈ మేరకు జనవరి నిర్వహించిన బీసీసీఐ డోపింగ్ టెస్టింగ్ ప్రోగ్రామ్లో అభిషేక్ నిషేధిత ఉత్పేరకం వాడినట్లు తేలింది. ఈ నిషేధం జనవరి 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 14 తేదీ వరకూ అమల్లో ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇలా డోపింగ్ పాల్పడిన తొలి పంజాబ్ క్రికెటర్గా అభిషేక్ గుప్తానే కావడం విశేషం.
అయితే దగ్గు టానిక్లో ఉండే ఉత్ప్రేరకాన్ని తను డాక్టర్ సూచన మేరకే వాడినట్లు అభిషేక్ ఇచ్చిన వివరణతో నిషేధాన్ని 8 నెలలకే పరిమితం చేసింది. ''గుప్తా టెర్బుటలిన్ అనే నిషేధిత ఉత్ప్రేరకం తీసుకున్నాడు. సాధారణంగా వాడే దగ్గు మందులో టెర్బుటలిన్ ఉంటుంది. గుప్తా వివరణతో సంతృప్తి చెందాం. పోటీ క్రికెట్ ఆడకుండా అతడిని 8 నెలలు సస్పెండ్ చేశాం'' అని బీసీసీఐ తెలిపింది.
జనవరి 15న ఢిల్లీలో టీ20 మ్యాచ్ సందర్భంగా గుప్తా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడాడని బీసీసీఐ స్పష్టం చేసింది.