హైదరాబాద్లో బీసీసీఐ అవార్డుల ఫంక్షన్ గ్రాండ్గా జరిగింది. టీమిండియా ప్లేయర్లతో పాటు దేశవాళీ క్రికెటర్లు, బీసీసీఐ పెద్దలు ఈ వేడుకకు వచ్చారు. నాలుగేళ్ల తర్వాత నిర్వహించిన బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమానికి హర్షా భోగ్లే వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా చేతుల మీదుగా పలు ప్లేయర్లు అవార్డును అందుకున్నారు.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు బీసీసీఐ పాలీ ఉమ్రిగర్ అవార్డును అందజేసింది. 2019-20 క్యాలెండర్ ఏడాది నుంచి ఈ అవార్డులను ప్రకటించి సత్కరించింది. 2019-20కి గానూ పేసర్ మహ్మద్ షమి, 2020-21కి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, 2021-22కి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, 2022-23 క్యాలెండర్కి గానూ యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ అవార్డులు అందుకున్నారు. ఈ క్రమంలో అశ్విన్ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు.

బీసీసీఐ ఉత్తమ క్రికెటర్ అవార్డును అత్యధిక సార్లు అందుకున్న రెండో ఆటగాడి సచిన్తో కలిసి అశ్విన్ నిలిచాడు. వీరిద్దరు రెండు సార్లు పాలీ ఉమిగ్రర్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు రేసులో విరాట్ కోహ్లి అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లిని అయిదు సార్లు అవార్డుతో బీసీసీఐ సత్కరించింది.
అలాగే ఉమెన్స్ క్రికెట్లో స్పిన్ ఆల్రౌండర్ దీప్తి శర్మ 2019-20, 2022-23 క్యాలెండర్లలో ఉత్తమ క్రికెటర్గా అవార్డు గెలుచుకుంది. 2020-21, 2021-22కి గానూ స్టార్ క్రికెటర్ స్మృతి మంథాన అవార్డును అందుకుంది. కాగా, మాజీ ఆటగాళ్లకు అందించే సీకే నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఫరూక్ ఇంజనీర్, రవిశాస్త్రి అందుకున్నారు. ఈ సందర్భంగా రవిశాస్త్రి భావోద్వేగంతో మాట్లాడాడు. భారత క్రికెట్తో తనకి ఉన్న అనుబంధాన్ని వివరించాడు.
దేశం తరపున ప్రాతినిథ్యం వహించినందకు గౌరవంగా ఉందని రవిశాస్త్రి అన్నాడు. గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ గొప్ప శక్తిగా అవతరించిందని అన్నాడు. తన దృష్టిలో అత్యంత విలువైన పతకం గబ్బా టెస్టులో రిషభ్ పంత్ విన్నింగ్ షాట్ అని పేర్కొన్నాడు. టీమిండియా సాధించిన చారిత్రక గబ్బా టెస్టు విజయంలో రవిశాస్త్రి భారత జట్టు కోచ్గా కీలకపాత్ర పోషించాడు.